
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి
పెద్దకొత్తపల్లి: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తోందని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. మంగళవారం పెద్దకొత్తపల్లిలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. అలాగే విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, మధ్యాహ్న భోజనం సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా అవగాహన కల్పించారు. ఇంటింటి ప్రచారం బడిబాటలో బడిఈడు పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల వసతుల కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న శానిటేషన్ కార్మికులు పరిశుభ్రతపై ఇస్తున్న శిక్షణ తరగతులల్లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూత్రశాలలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. డీఈఓ వెంట ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులున్నారు.