
ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు అడిగితే చర్యలు
తిమ్మాజిపేట: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తేవాలని ఎమ్మెల్యే రాజేష్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇళ్ల మంజూరైందని ఎవరైనా డబ్బులు అడిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైన డబ్బులు ఇచ్చినట్లు తెలిసినా రద్దు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించారని, ఇందులో తన సొంత మండలం కంటే తిమ్మాజిపేటకే ఎక్కువగా 510 ఇళ్లు ఇచ్చామన్నారు. మరో రెండు విడతల్లోనూ ఇళ్లు వస్తాయన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలలో ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందేలా చూస్తామన్నారు. నన్ను ఆదరించి ఈ స్థానంలో నిలబెట్టారు.. మీకు అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీదేవి, నాయకులు వెంకట్రామరెడ్డి, మల్లయ్యగౌడ్, శ్రీనివాస్, వివేక్రెడ్డి, ఉస్మాన్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.