
కేజీబీవీల అప్గ్రేడ్
● జిల్లాలో కొత్తగా 9 కస్తూర్బాల్లోఇంటర్ తరగతులు ప్రారంభం
● ఈ ఏడాది నుంచే కృత్రిమ మేధ
(ఏఐ) బోధన
● అకౌంటింగ్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులకు ప్రాధాన్యం
● మెరుగైన విద్య, భోజనం, వసతి కల్పనతో పెరిగిన డిమాండ్
● పేద, మధ్య తరగతి బాలికలకు
వరంగా మారిన విద్యాలయాలు
అచ్చంపేట: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించగా.. సానుకూల స్పందన వచ్చింది. దీంతో పేదరికంతో తల్లిదండ్రులు చదివించే స్తోమత లేక, స్థానికంగా పాఠశాలలు అందుబాటులో లేక, మధ్యలో చదువు మానేసిన, బడిబయటి ఆడపిల్లలకు రెసిడెన్షియల్ విద్య అందించేందుకు కేంద్రం 2005 సంవత్సరంలో కేజీబీవీలను నెలకొల్పింది. ఈ పాఠశాలలు అనాథ, పేద, మధ్య తరగతి కుటుంబాల బాలికలకు వరంగా మారాయి. భోజనం, వసతి కల్పించడంతోపాటు నాణ్యమైన విద్య అందిస్తుండటంతో క్రమంగా వీటిలో ప్రవేశాలకు పోటీ పెరిగింది. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న కొన్ని పాఠశాలల్లో 2018లో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టారు. తాజాగా అన్ని పాఠశాలల్లో ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేసేందుకు కేంద్రం అంగీకరించగా నిరుపేద విద్యార్థినులకు మేలు జరగనుంది. దీంతోపాటు కేజీబీవీలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తరగతులు ప్రవేపెట్టాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
స్వయం ఉపాధి కోర్సులు
కేజీబీవీ కళాశాలలో 160 ఎంపీసీ, బైపీసీ కోర్సులు ఉండగా.. మరికొన్నింట్లో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించనున్న ఇంటర్మీడియట్ తరగతుల్లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తోపాటు అకౌంటింగ్, కంప్యూటర్ సైన్స్, ఎంపీహెచ్డబ్ల్యూ వంటి డిమాండ్ ఉన్న కోర్సులను ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విద్యార్థులకు భవిష్యత్లో స్వయం ఉపాధి పొందేలా వృత్తి విద్యా కోర్సులతోపాటు కుట్లు, అల్లికలు, కరాటే వంటి వాటిలోనూ శిక్షణ ఇస్తున్నారు. ఈ పాఠశాలలో చదివే వారు చదువుతోపాటు స్వయం ఉపాధి కోర్సులు నేర్చుకునే అవకాశం లభిస్తుంది.
అప్గ్రేడ్ చేసినవి ఇవే..
అచ్చంపేట కేజీబీవీలో ఎంపీహెచ్డబ్ల్యూ, ఏఐ కోర్సులు, కోడేరులో కంప్యూటర్ సైన్స్, ఏఐ, పదరలో సీఈసీ, అకౌంటింగ్, తాడూరులో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ, పెద్దకొత్తపల్లిలో కంప్యూటర్ సైన్స్, ఏఐ, ఎంపీహెచ్డబ్ల్యూ, తిమ్మాజిపేటలో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ, ఉప్పునుంతలలో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ, ఊర్కొండలో ఎంపీహెచ్డబ్ల్యూ, ఏఐ, వంగూరులో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులతో ఇంటర్ విద్య ప్రారంభించనున్నారు.
అందుబాటులో 720 సీట్లు
జిల్లాలో 20 కేజీబీవీలు ఉండగా.. ఇప్పటికే 11 చోట్ల ఇంటర్ విద్య అందుబాటులో ఉంది. ఈ ఏడాది ప్రభుత్వం మిగిలిన 9 చోట్ల కూడా ఇంటర్ విద్యకు అనుమతించింది. అన్ని కేజీబీవీల్లో ఇంటర్ విద్య అందుబాటులోకి రాగా.. మొదటి సంవత్సరంలో చేరికకు 720 సీట్లు ఉన్నాయి. నాలుగు కేజీబీవీలో ఏఐతోపాటు కొత్తగా అకౌంటింగ్ కోర్సుల వల్ల బాలికల విద్యకు మంచి భవిష్యత్ లభిస్తుంది. – శోభారాణి, జీసీడీఓ

కేజీబీవీల అప్గ్రేడ్