
అమ్మమాట.. అంగన్వాడీ బాట
వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం
అచ్చంపేట: చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య ఎంతో కీలకం. వారు పాఠశాలల్లో చేరే నాటికి అక్షరాలు, అంకేలు నేర్పి అటపాటలతో కూడిన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు మంగళవారం నుంచి 17వ తేదీ వరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో‘అమ్మమాట–అంగన్వాడీ బాట’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. అమ్మమాట–అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న సామూహికంగా అక్షరభ్యాసం చేయించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలోనే అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు ఉచితంగా యూనిఫాం అందించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మానసిక ఒత్తిడికి లోనుకాకుండా..
ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీప్రైమరీ విద్య అందిస్తున్నారు. పిల్లలపై ఎలాంటి మానసిక ఒత్తిడి కలగకుండా నిపుణుల సూచన మేరకు ఆటలు, పాటలు, కథల ద్వారా చిన్నారులకు చదువుపై ఆసక్తి పెంపొందిస్తున్నారు. చిన్నారులను ఆకట్టుకునే విధంగా సిలబస్ రూపొందించారు. అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి యూనిఫాం అందజేస్తోంది.
బడిబాట పట్టేలా..
అంగన్వాడీ కేంద్రాల్లోని 3–6 ఏళ్ల పిల్లలను బడిబాట పట్టించేందుకు సిద్ధం చేస్తున్నారు. గతంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్గా భావించే వారు. చిన్నారులు పాఠశాల వాతావరణానికి అలవాటయ్యేలా.. పౌష్టికాహారం అందించి, ఆటలు ఆడించి, బడి అంటే భయం పోగొట్టే కేంద్రాలు అని అనుకునేవారు. అయితే గతేడాది నుంచి మార్పులు తెచ్చారు. కేవలం పౌష్టికాహారం అందించడం, ఆటపాటలతో గడపడమే కాకుండా.. వారికి విజ్ఞానాన్ని అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు వర్క్బుక్కులు అందించి.. వారితో హోంవర్క్ చేయిస్తున్నారు. ఎల్కేజీ వారికి తంగేడు పువ్వు పేరుతో నాలుగు పుస్తకాలు, యూకేజీ వారికి పాలపిట్ట పేరిట ఐదు పుస్తకాలు రూపొందించి ఆటపాటలతో బోధించారు. ప్రస్తుతం నిపుణ్ బారత్ ద్వారా వచ్చిన ప్రియదర్శిని పుస్తకంతో సులభ పద్ధతుల్లో విద్యా బోధనతో చిన్నారుల మేధస్సు వికసించనుంది.
అంగన్వాడీ కేంద్రాలు: 1,131
జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు: 4
ఆరేళ్లలోపు చిన్నారుల సంఖ్య: 46,229
గర్భిణులు: 5,745 బాలింతలు: 3,772
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజులపాటు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో అమ్మమాట–అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహిస్తాం. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు అలవాటు చేసి ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్య అందించడమే ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి అంగన్వాడీ టీచర్, ఆయాలు కృషి చేయాలి.
– రాజేశ్వరి, డీడబ్ల్యూఓ
రెండున్నరేళ్లు పైబడిన చిన్నారులను అంగన్వాడీ
కేంద్రాల్లో చర్పించడమే లక్ష్యం
నేటి నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు