
మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మృగశిర కార్తె రావడంతో వివిధ గ్రామాల భక్తులు భారీగా సొంత వాహనాల్లో పోట్టేళ్లను తీసుకొచ్చి అమ్మవారికి బలిచ్చి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చారు. ఈ ఒక్కరోజే సుమారు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి : సీపీఐ
పెంట్లవెల్లి: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్నర్సింహ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో చిన్న కుర్మయ్య అధ్యక్షతన సీపీఐ ఒకటో మహాసభ నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధే లక్ష్యంగా పోరాటాలు కొనసాగిస్తామని.. వందేళ్ల చరిత్ర గల పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని తెలిపారు. చరిత్రలో పదవులున్నా.. లేకున్నా కార్మిక, కర్షక, పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్న పార్టీ తమదని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న కొల్లాపూర్ కమ్యూనిస్ట్ల పోరాటం ఫలితంగా సాధించుకున్న కేఎల్ఐతో అభివృద్ధి దిశగా సాగుతుందని, నియోజకవర్గంలో లభించే ముడి సరుకుల ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా మండలంలో కూడా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దేశంపై జరుగుతున్న దాడులపై సమాధానం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను త్వరలోనే ఎండగడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐఏఎల్ రాష్ట్ర కార్యదర్శి బత్తిని రాము, జిల్లా కార్యదర్శి చిన్న కుర్మయ్య, తుమ్మల శివుడు, కిరణ్కుమార్, వంక గోపాల్, దేవ సహాయం, నిరంజన్, సువర్ణ, నర్సింహ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జోగుళాంబ క్షేత్రంలో భక్తుల సందడి
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తుల పోటెత్తారు. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన పూజలు, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల వేసవి సెలవులు ముగియనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీనికి తోడు మృగశిరకార్తె కావడంతో రైతులు, వ్యవసాయ సంబంధిత వ్యాపారులు సైతం తెల్లవారుజాము నుంచే రావడం జరిగింది. దీంతో పట్టణ పురవీధులు వాహనాలతో రద్దీగా మారాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్థానిక పుష్కర ఘాట్లో స్నానాలు అచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. జోగుళాంబ రైల్వే హాల్ట్ వద్ద గేట్ పడిన ప్రతి సారి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆలయ అధికారులు భక్తులకు తగు సౌకర్యాలు కల్పించారు. స్థానిక అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాద వసతి కల్పించారు.
కోయిల్సాగర్లో
పెరుగుతున్న నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 11.7 అడుగుల మేర నీటిమట్టం నిల్వ ఉంది. పాత అలుగు స్థాయి నీటిమట్టం 26.6 అడుగులు కాగా.. గేట్ల స్థాయి వరకు 32.6 అడుగులు. జూరాల ఎత్తిపోతల పథకం నీటి విడుదల ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు వరకు పాత అలుగుకు నీటిమట్టం చేరే అవకాశం ఉంది.

మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు