
మందుల కొరత లేకుండా చూడాలి
నాగర్కర్నూల్ క్రైం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా ఫార్మసీ అధికారులు చూసుకోవాలని, అవసరమైన మందుల కోసం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఇండెంట్ పెట్టాలని జిల్లా వైద్యాధికారి డా. స్వరాజ్యలక్ష్మి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని ఫార్మసీ అధికారులకు 2 డోస్ రోటాసీల్ వ్యాక్సిన్ నిర్వహణ, కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతుల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారుల్లో నీళ్ల విరేచనాల నియంత్రణకు రోటసిల్ వ్యాక్సిన్ నోటి ద్వారా ఎంత మోతాదులో ఇవ్వాలనే విషయాలపై అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసీ అధికారులు ప్రతి మూడు నెలలకు ఒకసారి కావాల్సిన మందులు అంచనా వేసి సెంట్రల్ మెడిసిన్ స్టోర్కు.. కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులైన నిరోధ్, నోటి మాత్రలు, కాపర్–టీ, ఇంజక్షన్ తదితర మందులకు కుటుంబ నియంత్రణ పోర్టల్లో ఆన్లైన్లో ఇండెంట్ పెట్టాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. ఎం.వెంకటదాస్, జిల్లా టీకీకరణ అధికారి డా. రవికుమార్, జిల్లా మాతా సంరక్షణ ప్రోగ్రాం అధికారి డా. లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఫార్మసీ అధికారులకు గుర్తించడం సంతోషం..
ఫార్మసిస్ట్లను ఫార్మసీ అధికారులుగా గుర్తిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం సంతోషమని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన పోస్ట్ ఫార్మసీ అధికారులదని జిల్లా వైద్యాధికారి డా. స్వరాజ్యలక్ష్మి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ కాపీని ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ డీఎంహెచ్ఓకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసీ అధికారుల కొరత ఉన్నా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ అధికారుల సంఘం అధ్యక్షుడు బత్తిని సుదర్శన్, సభ్యులు శరత్బాబు, యాదయ్య, అశోక్, జిల్లా అధ్యక్షుడు ఎం.సురేష్ పాల్గొన్నారు.