
‘రైతు భరోసా’ నిధులు విడుదల చేయాలి: సీపీఎం
కల్వకుర్తి రూరల్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రైతు భరోసా నిధులు వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సాగర్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని టీఎస్ యూటీఎఫ్ భవనంలో జరిగిన పార్టీ జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా వేసిందని.. అందులో చాలామందికి రాలేదన్నారు. వ్యవసాయశాఖ మంత్రి అప్పుడప్పుడు విలేకరులతో మాట్లాడుతూ.. తేదీలు ప్రకటిస్తున్నారనే తప్ప నిధులు మాత్రం జమ చేయడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమైందని.. రైతు భరోసా నిధులు వేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కావడం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నిధులు లేవని.. ఏమీ చేయలేకపోతున్నామని చెప్పడం శోచనీయమన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలవదా అని ప్రశ్నించారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యులు ఆంజనేయులు, శ్రీనివాస్, దేశ్యానాయక్, పరశురాములు, బాలస్వామి, కాశన్న, బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.