
వేడుకలకు సర్వం సిద్ధం
నాగర్కర్నూల్ క్రైం: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆదివారం ముందస్తుగా కలెక్టరేట్తో పాటు రద్దీ ప్రాంతాల్లో పోలీసులు బాంబ్స్క్వాడ్, డాగ్స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు. ముఖ్యఅతిథి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేదికకు ఎడమ వైపున వీఐపీ గ్యాలరీ, కుడివైపున ప్రజల గ్యాలరీ ఏర్పాటు చేశారు.
కార్యక్రమాలు ఇలా..
● పోలీస్ పరేడ్ మైదానానికి 9.40 గంటలకు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, 9.45కు కలెక్టర్ బదావత్ సంతోష్ చేరుకుంటారు.
● 9.50కి ముఖ్యఅతిథి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి చేరుకుని 9.52కు అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు.
● 10 గంటలకు పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి
10.05కి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు.
● 10.15 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ, సంక్షేమ పథకాలపై ముఖ్యఅతిథి ప్రసంగిస్తారు.
● 11 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 11.30కి వందన సమర్పణతో వేడుకల ముగింపు ఉంటుంది.
ముస్తాబైన పోలీస్ పరేడ్ మైదానం
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి