
ఉపాధ్యాయుల సర్దుబాటు సరికాదు
అచ్చంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారని, ప్రభుత్వం వెంటనే ఈ ప్రక్రియను విరమించుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.గోవర్ధన్, రామస్వామి డిమాండ్ చేశారు. పేద వర్గాల బిడ్డలకు నైపుణ్య విద్యను అందించాలనే తపన ఉంటే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి కాకుండా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని, తరగతికి ఒక గది నిర్మించాలని సూచించారు. మే నెలలో ప్రతి శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని సూచిస్తూ ప్రాథమిక స్థాయిలో 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, 10 నుంచి 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని చెప్పడం అశాసీ్త్రయమైన, అసంబద్ధమైన విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇది పేద ప్రజలకు నైపుణ్య విద్యను అందకుండా చేయడంలో భాగమేనని, తద్వారా విద్యారంగాన్ని ప్రైవేట్ శక్తులకు అప్పగించడం జరుగుతుందన్నారు.
మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. వానాకాలం సాగు సమయం, పాఠశాలలు పునః ప్రారంభం కానుండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ వారం 12 వేల మందికిపైగా భక్తులు ఆలయానికి వచ్చారని.. హుండీ, టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.1.85 లక్షల ఆదా యం సమకూరిందని ఆలయ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. వనపర్తి, నాగర్కర్నూల్, కొ ల్లాపూర్ డిపోల నుంచి బస్సులు నడిపించారు.
ఉత్సాహంగా బాస్కెట్బాల్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా 3X3 పురుషులు, మహిళా బాస్కెట్బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్ బిన్ అహ్మద్, జాకీర్ మాట్లాడుతూ.. బుధ, గురువారం ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలో మొదటి రాష్ట్రస్థాయి 3X3 బాస్కెట్బాల్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నీలో ఆయా జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు, 50 మంది అఫీషియల్స్ హాజరవుతారని తెలిపారు.