
అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ
కందనూలు: సికింద్రాబాద్లోని జింఖాన మైదానంలో ఆదివారం నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ చాటారు. అండర్–12 విభాగం 600 మీటర్ల పరుగు పందెంలో అభినవ్రెడ్డి, కిడ్స్ జాలిన్ త్రోలో శ్రీచైతన్య కిరణ్య సిల్వర్ మెడల్, 300 మీటర్ల పరుగు పందెంలో శివరామకృష్ణ గోల్డ్ మెడల్ సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సోలపోగుల స్వాములు సోమవారం తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు వ్యాయామ ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
మన్ననూర్: అమ్రాబాద్ మండలం ఎల్మపల్లిలోని గిరిజన బాలికల సంక్షేమ మినీ గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఖాళీ సీట్ల భర్తీ కోసం అర్హులైన గిరిజన బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జె.లింగమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో 30 సీట్లు, 2వ తరగతిలో 6 సీట్లు, 3వ తరగతిలో 1 సీటు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల గిరిజన బాలికలు ఈ నెల 6వ తేదీలోగా దరకాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు దరఖాస్తు పారంతో పాటు ఆధార్, రేషన్కార్డు జిరాక్స్, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు జత చేయాలన్నారు. మరింత సమాచారం కోసం 77320 82256 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
పీయూలో ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ల నియామకం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్లను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ సోమవారం నియమించారు. ఈ మేరకు గత కొన్ని సంవత్సరాలుగా ఫార్మసీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న ఈశ్వర్కుమార్, రవీందర్రెడ్డిలను నియమిస్తూ.. ఉత్తర్వులను వారికి అందజేశారు.
పోలీస్శాఖ పాత్ర కీలకం
మహబూబ్నగర్ క్రైం: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పోలీస్ శాఖ ఎంతో కీలకమని డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం జోగుళాంబ జోన్– 7 డీఐజీ కార్యాలయం ఎదుట డీఐజీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజల రక్షణ కోసం పోలీస్ సిబ్బంది కట్టుబడి పనిచేయాలన్నారు. అలాగే ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల కృషి అభినందనీయమన్నారు. పోలీసులు క్రమశిక్షణతో సేవలు అందిస్తూ ప్రజల అభి మానం గెలుచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి పాల్గొన్నారు.

అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ