
కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటం
అచ్చంపేట రూరల్: ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డు సమస్యలకు నిలయంగా మారిందని, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ పోరాడుతుందని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ అన్నారు. ఆదివారం అచ్చంపేటలోని టీఎన్జీఓ భవనంలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక సంక్షేమబోర్డులో సెస్ సక్రమంగా జమ కాకపోవడంతో కార్మిక సంక్షేమ నిధులు పెరగడం లేదన్నారు. బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిథ్యం కల్పించాలని, మెడికల్ చెకప్ల పేరుతో జరుగుతున్న ఆర్థిక దోపిడీపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. సంక్షేమబోర్డును ఎత్తి వేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని.. రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు పోరాటాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు పెర్ముల గోపాల్, మల్లేష్, కృష్ణ, చంద్రం, శివరాజు, రాములు, తిరుపతయ్య, సైదమ్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.