
గర్భిణులలో రక్తహీనతను అరికట్టాలి
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని ప్రతి గర్భిణికి కచ్చితంగా వైద్యాధికారి సూచన మేరకు 12 వారాల తర్వాత ప్రసవ ప్రణాళిక తయారు చేసి అమలుపరచాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశ, నోడల్ పర్సన్లతో సమీఞా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా గర్భిణులలో రక్తహీనతను అరికట్టడంలో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలని సూచించారు. గర్భిణులు ప్రతిరోజు ఐరన్, ఫోలిక్, క్యాల్షియం మాత్రలు కచ్చితంగా వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టడం వల్ల ముందస్తు ప్రసవాలు, గర్భస్రావాలు, తక్కువ బరువుతో శిశు జననాలను అరికట్టవచ్చన్నారు. హైరిస్క్ గర్భిణులు సురక్షిత మాతృత్వం పొందే వరకు వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా టీకాకరణ అధికారి రవికుమార్, ఎంహెచ్ఎన్ ప్రోగ్రాం అధికారి లక్ష్మణ్, డీపీఓ రేనయ్య, డీపీహెచ్ఎన్ఓ మంగమ్మ, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ శివకుమార్, ఏపీఓ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.