
పేదల జీవితాల్లో వెలుగులే లక్ష్యం
వెంకటాపురం(ఎం): పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. మండలకేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన బయ్య ప్రమీల నిర్మించుకున్న ఇందిరమ్మ గృహాన్ని గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు ఎంతో ఆసరాగా నిలిచిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుకు వస్తుందన్నారు. రైతును రాజుగా చూడాలనే సంకల్పంతోనే సన్న ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. తొమ్మిది నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్లతో రెండు లక్షలలోపు రైతుల రుణాలను మాఫీ చేసినట్లు వివరించారు. రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామన్నారు. మూడు విడతల్లో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసేందుకు తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో 7 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడమే కాకుండా 17 లక్షల పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు నమోదు చేశామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, జిల్లా నాయకులు మిల్కూరి అయిలయ్య, బైరెడ్డి భగవాన్రెడ్డి, మామిడిశెట్టి కోటి, చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్, జంగిలి రవి, చెన్నోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రామప్ప ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పాలి
రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రామప్పలో కొనసాగుతున్న వరల్డ్ హెరిటేజ్ క్యాంపునకు ఆమె హాజరై వలంటీర్లనుద్దేశించి మాట్లాడారు. హెరిటేజ్ క్యాంపెయిన్లో నేర్చుకున్న ప్రతీ అంశాన్ని, కాకతీయుల చరిత్రను, రామప్ప దేవాలయ విశిష్టతను మీమీ ప్రాంతాల్లో వివరించాలని వలంటీర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పాండురంగారావు, క్యాంపు కోఆర్డినేటర్ శ్రీధర్రావు, సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ విడతల వారీగా
ఇందిరమ్మ ఇళ్లు
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క

పేదల జీవితాల్లో వెలుగులే లక్ష్యం