
‘ఇసుక క్వారీ నిర్వహణపై కలెక్టర్ స్పందించాలి’
మంగపేట: మండల పరిధిలోని రమణక్కపేట కొమురంభీం ఎస్టీ ఇసుక క్వారీ నిర్వహించకపోవడంపై కలెక్టర్ దివాకర తక్షణమే స్పందించాలని ఇసుక క్వారీ సొసైటీ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని రమణక్కపేట ఇసుక క్వారీ వద్ద సొసైటీ సభ్యులు, గ్రామస్తులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. మార్చి 28న రమణక్కపేట 2, గొల్లగూడెం ఇసుక క్వారీల నిర్వహణపై నిర్వహించాల్సిన పెసా గ్రామసభను కలెక్టర్ మౌఖిక ఆదేశాలతో నిలిపి వేయించి నెల రోజులు గడుస్తున్నా తిరిగి గ్రామసభను నిర్వహించకుండా పొంతన లేని కారణాలతో అడ్డు కుంటున్నాడని ఆరోపిస్తూ మూడు రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామసభ నిర్వహణ షెడ్యూల్ ప్రకారం మండల పరిధిలోని మల్లూరు, చుంచుపల్లి, కత్తిగూడెం గిరిజన సొసైటీ ఇసుక క్వారీలకు గ్రామసభలు నిర్వహించి నెల రోజులు గడుస్తున్నా తమ సొసైటీ క్వారీ నిర్వహణకు ఎందుకు గ్రామసభ నిర్వహించలేదనే విషయంపై కలెక్టర్ తక్షణమే వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. తమ గ్రామంలో గ్రామసభ నిర్వహించేందుకు భూభారతి, అకాల వర్షాలు, పంటనష్టం సర్వే వంటి తదితర కారణాలు చెబుతున్న కలెక్టర్కు కత్తిగూడెం ఇతర సొసైటీలకు గ్రామసభలు నిర్వహించినప్పుడు అవి అడ్డు రాలేదా అని ప్రశ్నించారు. పొంతనలేని సాకులు చెబుతూ ప్రజలకు ఉపాధి లేకుండా చేస్తున్నారని తెలిపారు. ఇదే విధంగా కొనసాగితే ఉపాధి కోల్పోయిన ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి పెసా గ్రామసభ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో తమ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు నాగార్జున్, సందీప్, వసంతరావు, గుమ్మల వీరస్వామి, కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.