
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం
ములుగు/ఏటూరునాగారం: అగ్ని ప్రమాదాలపై ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఫైర్స్టేషన్ ఆఫీసర్ కుమారస్వామి సూచించారు. అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాల సందర్భంగా ములుగు బస్టాండ్ ఆవరణలో మంగళవారం ములుగు అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై మాక్డ్రిల్ను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిబ్బంది అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు వాల్ పోస్టర్లను అంటించారు. నీటితో వివిధ రకాల విన్యాసాలను ప్రదర్శించారు. విన్యాసాల ద్వారా అగ్నిని ఆర్పే పద్ధతులు, ఫైర్ సిబ్బంది చేసే సహాయక చర్యలపై, అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తల గురించి, ప్రమాద సమయంలో తక్షణం ఎలా స్పందించాలో, ఫైర్ సర్వీస్ నంబర్ని ఎలా వినియోగించాలో వివరించారు. ప్రజల సహకారం ఉంటే అగ్ని ప్రమాదాలను ముందుగా గుర్తించి నివారించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్మెన్ మహేశ్వర్, డీఓపీ సురేందర్, ఫైర్మెన్లు మహేందర్, రాజు, ప్రవీణ్, సాయి కుమార్, హోంగార్డ్ ధన్సింగ్లు పాల్గొన్నారు. అదే విధంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో అగ్ని ప్రమాదాల నివారణ వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ అధికారి సత్తయ్య మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తతో వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకురావాలన్నారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు 101 లేదా 8712685772 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం వాల్పోస్టర్లను విడుదల చేసి ప్రయాణికులకు కనిపించే విధంగా ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన కూడళ్లలో వాటిని అంటించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రవికుమార్, అనిల్, భార్గవ్, రాజు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఫైర్స్టేషన్ ఆఫీసర్ కుమారస్వామి

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం