
తమ్ముడి ప్రేమ వివాహం..
ములుగు రూరల్: తమ్ముడు ప్రేమించి వివాహం చేసుకొని నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ అమ్మాయి అన్నదమ్ములు కోపం పెంచుకొని అబ్బాయి తండ్రి సమ్మయ్య, అన్న సురేశ్లపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన మల్లంపల్లి మండలం దేవనగర్లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దేవనగర్ గ్రామానికి చెందిన ముక్కాముల సమ్మయ్య గొర్రెల కాపరిగా జీవనం కొనసాగిస్తున్నాడు. తనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు నవీన్ అదే గ్రామానికి చెందిన మద్దెవేని కొమురయ్య కుమార్తె సౌజన్యను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇద్దరు మేజర్లు కావడంతో వివాహం చేసుకొని పోలీస్ స్టేషన్లో రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై ఇరువర్గాల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ చేసి పంపించారు. మంగళవారం సమ్మయ్య బంధువు మృతి చెందగా తన రెండో కుమారుడు సురేశ్ హైదరాబాద్ నుంచి ఇంటి వచ్చాడు. సాయంత్రం సమయంలో తండ్రిని ద్విచక్ర వాహనంపై రంగాపూర్ సమీపంలో గొర్రెల మంద వద్దకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో అమ్మాయి అన్నదమ్ములు మద్దెవేని సతీష్, ప్రసాద్లు ద్విచక్రవాహనంపై వచ్చి దేవనగర్ సమీపంలోని రైస్మిల్లు వద్ద వాహానాన్ని అడ్డగించి గొడ్డలితో సమ్మయ్య, సురేశ్లపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో సమ్మయ్య ఎడమ చేయి విరిగిపోయింది. సురేశ్ను గొడ్డలితో నరికే ప్రయత్నం చేయగా చేయి అడ్డుపెట్టడంతో అరచేతికి గాయమైంది. రక్తస్రావం కావడంతో భయంతో గ్రామంలోకి పరుగులు తీశాడు. కొంత దూరం వెంబడించి వదిలేశారు. గమనించి వారు పోలీసులకు, 108కు సమాచారం అందించారు. గాయపడిన వారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు సురేశ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తండ్రి, అన్నకు ప్రాణ సంకటం
ఇరువురిపై దాడికి పాల్పడిన
అమ్మాయి అన్నదమ్ములు

తమ్ముడి ప్రేమ వివాహం..