
ఇంటి పైకప్పు ధ్వంసం
వాజేడు : మండల పరిధిలోని టేకులగూడెం గ్రామంలో శుక్రవారం వీచిన గాలి దుమారానికి ఇంటి పైకప్పు లేచి ధ్వంసమైంది. ఆర్ఐ కుమార స్వామి తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని టేకులగూడెనికి చెందిన వనపర్తి సురేష్ ఇంట్లో ఒక్కసారిగా వీచిన గాలిదుమారంతో పైకప్పు లేచిపోయింది. సుమారుగా రూ.10వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఆర్ఐ కుమారస్వామి తెలిపారు. అందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించినట్లు వెల్లడించారు.
షార్ట్ సర్క్యూట్తో
గేదెలు మృతి
ములుగు రూరల్ : బండారుపల్లి గ్రామానికి చెందిన గూడెపు శంకర్కు చెందిన మూడు గేదెలను గురువారం రాత్రి షెడ్లో కట్టివేశాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పాడి గేదెలు మృతి చెందాయి. కాగా బాధిత కుటుంబానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ రూ.5వేల ఆర్థికసాయం అందజేశారు. శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకొని మృతిచెందిన గేదెలను పరిశీలించారు. ఈ సందర్భంగా రవిచందర్ మాట్లాడుతూ..విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అందించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. నాయకులు కుక్కల నాగరాజు, ఆంగోత్ వంశీ, రాజన్న, రాకేష్, తదితరులు ఉన్నారు.
పనుల అడ్డగింత
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా కాటారం మండలం గారెపల్లిలో చేపడుతున్న రిజర్వాయర్ బండ్ పనులను శుక్రవారం నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు కోల్పోయి ఏళ్లు గడుస్తున్నా తమకు నష్టపరిహారం అందలేదని నిర్వాసిత రైతులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. భూమి కోల్పోయి, పంట నష్టపరిహారం అందక తమ కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం అందించేంత వరకు పనులు సాగనివ్వబోమని రైతులు తేల్చిచెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న ప్రాజెక్ట్ డీఈఈ ఉపేందర్, తహసీల్దార్ నాగరాజు, ఎస్సై శ్రీనివాస్ రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. సమస్య సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రైతులతో సమావేశం ఏర్పాటు చేసేలా చూస్తామని పేర్కొన్నారు. నిర్వాసిత రైతులు రాజు, రాజయ్య తదితరులు ఉన్నారు.
భూ సేకరణ
త్వరగా పూర్తిచేయాలి
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా ప్రధాన కాల్వల నిర్మాణం కోసం చేపడుతున్న భూ సేకరణ ప్రక్రియలో వేగంపెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ భూ సేకరణ విభాగం అధికారులకు సూచించారు. కాటారం మండలం గుమ్మాళ్లపల్లి, గూడూరు గ్రామాల్లో కొనసాగుతున్న భూ సేకరణ సర్వేను అదనపు కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. భూ నిర్వాసిత రైతులతో మాట్లాడారు. పలువురు నిర్వాసిత రైతులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. భూ సేకరణకు అధికారులకు రైతులు సహకరిస్తే కాల్వల నిర్మాణ పనులు త్వరగా పూర్తవుతాయని.. తద్వారా సాగు నీరందుతుందని తెలిపారు.
పోక్సో కేసులో
ఒకరికి జైలు, జరిమానా
రేగొండ: పోక్సో కేసులో ఓ నిందితుడికి న్యాయస్థానం 55 రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఎస్సై సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన కౌటం రాజేందర్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి ఫొటోలు తీసి ప్రేమించాలని వెంబడిస్తూ ఆ యువతి ఫొటోలను సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టు చేశాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కేసు శుక్రవారం వాయిదాకు రాగా, పూర్వపరాలు పరిశీలించాక నేరం రుజువు కావడంతో నిందితునికి 55 రోజుల శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్ఙి నారాయణ బాబు తీర్పు చెప్పారు.

ఇంటి పైకప్పు ధ్వంసం

ఇంటి పైకప్పు ధ్వంసం