లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా.. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా మెప్పించింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీని నయనతార సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ సంస్థ, ఎస్ ఎస్. లలిత్కుమార్కు చెందిన సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై నిర్మించారు.
ఇదిలా ఉండగా.. నయన్, విఘ్నేశ్ శివన్ ఓ శానిటరీ నాప్కిన్ యాడ్లో నటించారు. ఈ యాడ్ ప్రమోషన్ కోసం ఇన్ఫ్లుయెన్సర్లను ఆహ్వానించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో యాడ్ మేనేజర్ చేసిన కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి. 'దయచేసి సహకరించండి.. వీళ్లు సాధారణ ప్రజలు కాదు'.. అంటూ అక్కడున్న ఇన్ఫ్లూయన్సర్లను సముదాయించే ప్రయత్నం చేశాడు. దీంతో కార్యక్రమానికి హాజరైన ఇన్ఫ్లుయెన్సర్లు నయన్- విఘ్నేశ్ జంటకు అధిక ప్రాధాన్యత కల్పించడాన్ని విమర్శించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఈ వివాదానికి గల కారణంపై విఘ్నేశ్ శివన్ క్లారిటీ ఇచ్చారు.
నిజానికి మేనేజర్ అక్కడ 'మేము సాధారణ ప్రజలం కాదు.. మేము ఇన్ఫ్లుయెన్సర్లం' అని చెప్పారని విఘ్నేశ్ శివన్ క్లారిటీ ఇచ్చాడు. ఆ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేసిన వారు ఎడిట్ చేసి పెట్టారని అన్నారు. లైకులు, వ్యూస్ కోసం 'మేము' అనే పదాన్ని 'వారు'గా మార్చి వక్రీకరించారని తెలిపారు. ఆ తర్వాత మేము ఆ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని సంప్రదించగా.. దానికి ఎక్కువ వ్యూస్ వస్తున్నందున ఆ వీడియోను అలాగే ఉంచేలా సహకరించాలని మమ్మల్ని అతను కోరాడని విఘ్నేశ్ వెల్లడించారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లైంది.


