
బంజారాహిల్స్: సినిమా షూటింగ్ను మధ్యలోనే నిలిపివేసి ఆ సినిమాకు సంబంధించిన ఫుటేజీలు ఉన్న ల్యాప్ట్యాప్లు, ఐప్యాడ్ను తీసుకువెళ్లిన ఘటనలో నమ్మకద్రోహానికి పాల్పడ్డ సినీ దర్శకుడిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ అల్లు సాయిలక్ష్మణ్ సినిమాలు నిర్మించేందుకు హైదరాబాద్కు వచ్చి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని స్రవంతినగర్లో ఓ అపార్ట్మెంట్లో ప్లాట్ తీసుకుని సినిమా కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. 2024లో సినిమా నిరి్మంచేందుకు అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన సాయిలక్ష్మణ్ అల్లు ఆర్ట్స్ అకాడమీ ప్రొడక్షన్ పేరుతో మల్లిఖార్జున్ అనే డైరెక్టర్తో ‘గాడ్స్ ప్రీమియర్ లీగ్’ (జీపీఎల్) సినిమాను మొదలుపెట్టాడు.
ఈ సినిమాకు వేములవాడ శివకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్గా కుదిరాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొద్దిరోజులకే డైరెక్టర్ మల్లిఖార్జున్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో నిర్మాత సాయిలక్ష్మణ్ ఆ సినిమా షూటింగ్ను నిలిపివేశాడు. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న వేములవాడ శివకుమార్ను డైరెక్టర్గా పెట్టుకుని ప్రొడక్షన్ నెంబర్–1 పేరుతో మరో సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా చిత్రీకరణ 35 రోజులు పూర్తయిన తర్వాత సాయిలక్ష్మణ్ తన వ్యాపారం నిమిత్తం అమెరికా వెళ్లిపోయాడు. ఆయన వెళ్లిపోయిన తర్వాత సినిమా షూటింగ్ నిలిచిపోయింది.
షూటింగ్ జరపాలంటూ పలుమార్లు యూఎస్ఏ నుంచి సాయిలక్ష్మణ్ చెప్పినా శివకుమార్ వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా షూటింగ్కు సంబంధించిన ఫుటేజీలు, ఒక ఐటమ్ సాంగ్, మరో పాట రెండు ల్యాప్ట్యాప్లలోనూ, రెండు ఐప్యాడ్లలోనూ స్టోర్ చేసి ఉంచగా..వీటిని నిర్మాతకు చెప్పకుండా శివకుమార్ కార్యాలయాల నుంచి తీసుకువెళ్లిపోయాడు. తెచ్చి ఇవ్వాలని చెప్పినా వినిపించుకోలేదు.
ఈ ల్యాప్ట్యాప్, ఐప్యాడ్లలో సినిమా డేటాతో పాటు ఫిలిం మేకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయని నిర్మాత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు దర్శకుడు శివకుమార్ సినిమా దృశ్యాలతో పాటు పాటలను ఇన్స్ట్రాగామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో పోస్ట్ చేశారని, ఇది తమకు ఎంతో నష్టాన్ని కలిగించేదిగా ఉందని ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు డైరెక్టర్ శివకుమార్పై బీఎన్ఎస్ సెక్షన్ 316 (4) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.