
కళాశాల విక్రయించి ఉడాయించిన యాజమాన్యం
● రూ.కోట్లు టోకరా..!? ● పోలీసులను ఆశ్రయించిన బాధితులు
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం సుమారు రూ.2కోట్లు టోకరా వేసి ఉడాయించడం చర్చనీయాంశంగా మారింది. అప్పులు ఇచ్చిన బాధితులు సుమారు 70మంది ఉండగా వీరిలో కొందరు న్యాయం కోసం శనివారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం.. మంచిర్యాలలోని ప్రైవేటు కళాశాల యాజమాన్యం రిక్కల మహేందర్రెడ్డి కళాశాల, భవనం విక్రయించి వెళ్లిపోయాడని ఆరోపిస్తున్నారు. కళాశాల విద్యార్థుల సర్టిఫికేట్లు కళాశాలకు సంబంధం లేని అతడి స్నేహితుడు లక్సెట్టిపేటకు చెందిన ఓ ప్రైవేటు కళాశాల యజమానికి అప్పగించాడని పేర్కొంటున్నారు. సర్టిఫికేట్లు ఇచ్చేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.6వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పై చదువులకు వెళ్లేందుకు టీసీ, సర్టిఫికేట్లు అవసరం ఉండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక సీఐని సంప్రదించగా.. విషయం తమ దృష్టికి వచ్చిందని, బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ చేస్తామని పేర్కొన్నారు.