
మోటార్ సైకిళ్ల దొంగల అరెస్ట్
మల్దకల్: కొంతకాలంగా గద్వాల, జడ్చర్ల, వనపర్తి, పెబ్బేరు, మహబూబ్నగర్ ప్రాంతాల్లో అపహరణకు గురైన మోటార్ సైకిళ్లను జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని అమరవాయిలో బుధవారం కర్నూల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమరవాయిలో 25 బైక్లను పోలీసులకు పట్టుబడడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా.. గద్వాల పట్టణానికి చెందిన జశ్వంత్ వారం రోజుల క్రితం కర్నూలు పట్టణంలో మోటార్ సైకిల్ను దొంగలించడంతో కర్నూలులోని టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో సీఐ నాగరాజురావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మోటారుసైకిల్ చోరీపై విచారణ చేపట్టి గద్వాల పట్టణానికి చెందిన జశ్వంత్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా 30కు పైగా బైక్లు చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో సీఐతో పాటు పోలీసు సిబ్బంది మహేందర్, రవి, శ్రీను అమరవాయికి చేరుకొని జశ్వంత్కు సహకరించిన బోయ వీరేష్, పాండు, బోయ పాండులను అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో జశ్వంత్ చోరీ చేసిన బైక్లను గ్రామంలోని కొంతమంది రైతులు, వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దొంగలించిన బైక్లను కొన్న యజమానులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించడంతో వారు బైక్లను పోలీసులకు అప్పగించారు. అమరవాయిలో 18, బిజ్వారంలో 2, సద్దలోనిపల్లి, అయిజ, మల్దకల్ తదితర గ్రామాల్లో 25 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వాటిని త్వరలోనే స్వాధీనం చేసుకుంటామన్నారు. తక్కువ ధరకు వచ్చే వాహనాలను ఎవరూ కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచించారు. వాహనాలు కొనుగోలు చేసే సమయంలో అమ్మే వారి నుంచి ఆధార్, ఆర్సీ, లైసెన్సులు తప్పనిసరిగా పరిశీలించాలన్నారు.

మోటార్ సైకిళ్ల దొంగల అరెస్ట్