పాముకాటుతో వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో వృద్ధుడు మృతి

Sep 11 2025 2:33 AM | Updated on Sep 11 2025 2:33 AM

పాముకాటుతో  వృద్ధుడు మృతి

పాముకాటుతో వృద్ధుడు మృతి

మానవపాడు: పాము కాటుతో వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలోని కొర్విపాడులో బుధవారం జరిగింది. ఎస్‌ఐ చంద్రకాంత్‌ తెలిపిన వివరాలు.. మండలంలోని కొర్విపాడు గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి(77) ఉదయం సొంత పొలంలో కాడెద్దులతో దున్నుతుండగా గుర్తు తెలియని పాము కాటు వేసింది. స్థానికులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

రాజాపూర్‌(బాలానగర్‌): పురుగుల మందుతాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బాలానగర్‌ మండలంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. వీరన్నపల్లి గ్రామానికి చెందిన తెలుగు ఎల్లయ్య(57) భార్య పద్మమ్మ 4 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. భార్య మృతితో నాలుగు ఏళ్ల మనోవేదన వల్ల కుటుంబ సభ్యులతో బాధపడుతూ ఉండేవాడు. మంగళవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. చుటుపక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. అతని కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు బాలానగర్‌ ఎస్‌ఐ లెనిన్‌గౌడ్‌ తెలిపారు.

బాలుడి మృతదేహం లభ్యం

గద్వాల క్రైం: ఈనెల 7వ తేదీన చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు జూరాల లోయర్‌ జెక్‌(కృష్ణానది) గల్లంతైన మైనర్‌ బాలుడు బుధవారం రేకులపల్లి సమీపంలో లభ్యమైనట్లు రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. తెలుగు రాజేష్‌, తెలుగు చంద్రశేఖర్‌(13)లు చేపల వల వేసేందుకు వెళ్లారు. అనంతరం ఒడ్డుకు పుట్టిలో ఇద్దరు నిద్రపోయారు. జూరాలకు ఇన్‌ఫ్లో పెరగడంతో అలల తాకిడికి పుట్టి ముందుకు సాగుతూ కృష్ణానదిలో గల్లంతైయింది. తెలుగు రాజేష్‌ ఈత రావడంతో ప్రాణాలను కాపాడుకున్నాడు. నీటి ప్రవాహంలో గల్లంతైన చంద్రశేఖర్‌ ఆచూకీ లభించలేదు. బుధవారం నది నుంచి రెండు కిలో మీటర్ల దూరంలో ఉదయం మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

విద్యుదాఘాతంతో

రైతు మృతి

పాన్‌గల్‌: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాందాపూర్‌ గ్రామానికి చెందిన రైతు సంగనమోని రాములు (53) భీమా కాల్వలో ఉన్న బోరు మోటార్‌కు చుట్టుకున్న నాచు తొలగించేందుకు కాల్వలో దిగాడు. ఈ క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య బిచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు హెచ్‌సీ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement