
జూరాలకు నిలకడగా వరద
11యూనిట్లలో 435 మెగావాట్ల ఉత్పత్తి
దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈమేరకు శనివారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, 68.180 మిలియన్ యూనిట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 79.215 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 147.395 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు.
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో వరద పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శుక్రవారం ప్రాజెక్టుకు లక్షా5వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. శనివారం సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో లక్షా 24వేల క్యూసెక్కులకు పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 12 క్రస్టు గేట్లను ఎత్తి 86, 340 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 27, 790 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 290 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 1,15,978 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.571 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.
1.24లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
ప్రాజెక్టు 12 క్రస్టు గేట్ల ఎత్తివేత
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
దిగువకు 1,15,978 క్యూసెక్కులు