
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు
మన్ననూర్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణతో కలిసి మన్ననూర్లోని జంగాల కాలనీలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. పలువురు లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం అటవీశాఖ విశ్రాంతి గృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో టీపీసీసీ అధ్యక్షుడు సమావేశమై మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతుభరోసా తదితర పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ పేరున పేదల సొంతింటి కలను సాకారం చేయడం గర్వంగా ఉందన్నారు. గుడిసెలు లేని గ్రామాలు ఉండాలన్నదే ఇందిరాగాంధీ ఆశయమన్నారు. అందుకు అనుగుణంగా సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా, మన్ననూర్ తదితర గ్రామాల్లో కోతులు అధికమై పంటలను నాశనం చేస్తుండటంతో రైతులు పంటల సాగుకు దూరమవుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరినారాయణ టీపీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన.. ఈ ప్రాంతంలోని ఆదివాసీ చెంచులు, ఇతర వర్గాల వారికి వ్యవసాయపరంగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సాగులో ఉన్న ప్రతి రైతుకు ప్రభుత్వం సబ్సిడీతో బోరు, సోలార్ విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. సాంకేతిక కారణాలతో రైతుభరోసా అందని రైతులకు త్వరలోనే వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అయ్యేలా చూస్తామన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
మహేశ్కుమార్గౌడ్