
ప్రైవేటు స్కూల్స్ నిర్వాకం
●
ఇది చివరి నోటీసు..
గతంలో ప్రియదర్శిని పాఠశాలలో అనుమతులు లేకుండా హైస్కూల్ విద్యార్థులకు బోధించడం, అక్కడే హాస్టల్ నిర్వహించడం వంటి వాటిపై ఫిర్యాదులు రావడంతో ఎంఈఓ విచారణ రిపోర్టు ఆధారంగా నోటీసులు ఇచ్చాం. ఈ పాఠశాలలకు ఓపెనింగ్ పర్మిషన్, నామినల్ రోల్స్ శ్రీప్రతిభ పాఠశాలకు చెందినవిగా గుర్తించి ఆ పాఠశాలకు గతంలో నోటీసు ఇచ్చినా స్పందించలేదు. మళ్లీ ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చాం. నిర్ణీత గడువులోగా నోటీసులకు స్పందించకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. శ్రీప్రతిభ పాఠశాలలో పుస్తకాలు, యూనిఫాంలు అమ్ముతున్నారని కూడా ఫిర్యాదులు వచ్చాయి. దానిపై నోటీసులు ఇచ్చాం. తదుపరి చర్యలు ఉంటాయి.
– ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు చేసే పనులకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. తాము ఏం చేసినా చెల్లుతుందిలే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. అసలు హైస్కూల్కు అనుమతులే లేకున్నా.. నేరుగా 8 నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకుని విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నారు. అడ్మిషన్లు చేసుకుని ఏకంగా తరగతులు సైతం బోధించడంతో విచారణకు వెళ్లిన అధికారులు అవాక్కయ్యారు. పాఠశాలల్లో వసతులు, నిబంధనల ప్రకారం నిర్వహణ లేకపోవడం, యూనిఫాంలు, పుస్తకాలు అమ్మడం, అర్హులైన ఉపాధ్యాయులు లేకపోవడం ఒక ఎత్తయితే అసలు హైస్కూల్కు అనుమతులు లేని ప్రైమరీ పాఠశాలలో హైస్కూల్ అడ్మిషన్లు తీసుకుని నిర్వహించడం మరో ఎత్తు. ఇదీ ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న అడ్డగోలు వ్యవహారాలకు పరాకాష్టగా మారింది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ తతంగం.. గత ఏప్రిల్లో ఓ విద్యార్థి సంఘాల నాయకులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా బయటికి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు అనేక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
శ్రీప్రతిభ, ప్రియదర్శిని పాఠశాలలకు నోటీసులు..
మహబూబ్నగర్ పట్టణంలోని మోనప్పగుట్ట ప్రియదర్శిని పాఠశాలకు కేవలం ప్రైమరీ స్కూల్ నిర్వహించేందుకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. కానీ, ఏకంగా 8 నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. గత ఏప్రిల్లో ఈ విషయమై ఓ విద్యార్థి సంఘం నాయకులు ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 8వ తరగతిలో 10, 9వ తరగతిలో 12, 10వ తరగతిలో 12 మంది విద్యార్థులు తరగతులు వింటున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా సదరు పాఠశాలకు కేవలం 1 నుంచి 7వ తరగతి వరకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు నోటీసుల్లో స్పష్టం చేశారు. ఇదే విషయమై గతంలో శ్రీప్రతిభ స్కూల్కు కూడా డీఈఓ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇందుకు ప్రధాన కారణంగా పాఠశాల నిర్వహిస్తున్నది ప్రియదర్శిని పాఠశాల కాగా ఎస్సెస్సీ విద్యార్థులకు ఇచ్చే నామినల్ రోల్స్, ఈటీసీ వంటి శ్రీప్రతిభ పాఠశాలకు చెందినవిగా అధికారులు అక్కడ గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు ఇచ్చారు. వెంటనే సమధానం చెప్పాలని గతంలో ఈ పాఠశాలకు నోటీసులు ఇస్తే స్పందించలేదని అధికారులు పేర్కొంటున్నారు. మరోసారి గత నాలుగైదు రోజుల క్రితం నోటీసులు ఇచ్చామని నిర్ణీత సమయంలో సమాధానం ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు.
అడ్డగోలుగా వ్యవహరిస్తున్న పలు ప్రైవేటు పాఠశాలలు
హైస్కూల్ అనుమతి లేకపోయినా తరగతులు బోధించిన ప్రియదర్శిని
మరో పాఠశాల పేరు మీద ఎన్ఆర్స్, ఈటీసీ పెట్టినట్లు గుర్తింపు
ఇది వరకే ఆ రెండింటికి షోకాజ్ నోటీసులు ఇచ్చిన విద్యాశాఖ
విచారణకు వెళ్లినప్పుడు 8 నుంచి 10వ తరగతి వారికి తరగతుల నిర్వహణ

ప్రైవేటు స్కూల్స్ నిర్వాకం