
జూరాలకు నిలకడగా ఇన్ఫ్లోలు
ధరూరు /ఆత్మకూరు/దోమలపెంట/శాంతినగర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లోలు నిలకడగా కొనసాగుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శుక్రవారం ప్రాజెక్టుకు 14వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్లలో విద్యుదుత్పత్తిని చేపట్టారు. ఇందుకోసం 15వేల 241 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 1500 క్యూసెక్కులు, కోయిల్ సాగర్కు 315 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 69 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 17,125 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.710 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.
37.424 ఎంయూ విద్యుదుత్పత్తి
ఎగువలో 2 యూనిట్లద్వార 78 మెగావాట్లు 17.808 మిలియన్యూనిట్లు, దిగువలో 2 యూనిట్లద్వార 80 మెగావాట్లు 19.616 మిలియన్యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని ఎస్ఈ శ్రీధర్ అన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 37.424 మిలియన్యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు.
శ్రీశైలంకు 37,136 క్యూసెక్కుల ఇన్ఫ్లో.
జూరాలలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 15,241 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 21,895 మొత్తం 37,136 క్యూసెక్కుల నీటి ప్రవాహం శుక్రవారం శ్రీశైలం జలాశయం వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంలో నీటిమట్టం 836.7 అడుగుల వద్ద 57.1874 టిఎంసీల నీటి నిల్వ ఉంది. రేగుమాన్గడ్డ నుంచి ఎంజికెఎల్ఐకు 326 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 3.641 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసి 7,860, ఎపి.జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 1.308 మి.యూనిట్లు ఉత్పత్తి చేసి 2,695 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్కు విడుదల చేశారు.
సుంకేసుల 3 గేట్లు ఎత్తివేత
రాజోళి సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి శుక్రవారం ఇన్ఫ్లో కొనసాగింది. ఎగువన కురుస్తున్న మోస్తరు వర్షాలతో బ్యారేజీ కి 13,296 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 1.110 టీఎంసీలు నిల్వ వుంచుతు 3 గేట్లు మీటరు ఎత్తి దిగువకు 13,137 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేసీ కెనాల్కు 159 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.