
జూరాల క్రస్టుగేట్ల మూసివేత
ధరూరు/ రాజోళి/ దోమలపెంట/ మదనాపురం/ ఆత్మకూర్: ఎగువన కురిసిన వర్షాలతో మూడు రోజులుగా జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో మరింతగా తగ్గినట్లు అధికారులు తెలిపారు. శనివారం కేవలం 25 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో తెరిచి ఉంచిన క్రస్టు గేట్లను మూసి వేసినట్లు వివరించారు. అయితే నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 1,500 క్యూసెక్కులు, జల విద్యుదుత్పత్తి నిమిత్తం 26,817 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45 క్యూసెక్కులు, కుడి కాల్వకు 240 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 28,602 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.357 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సుంకేసులలో ఒకే గేటు..
సుంకేసుల డ్యాం నుంచి 4 వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. శనివారం ఎగువ నుంచి 4,504 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. ఒక గేటును ఎత్తి 4,345 క్యూసెక్కులు, మరో 159 క్యూసెక్కులు కేసీ కెనాల్కు విడుదల చేసినట్లు చెప్పారు.
శ్రీశైలానికి 31,162 క్యూసెక్కులు
జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 26,817, సుంకేసుల నుంచి 4,345 కలిపి మొత్తం 31,162 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయం వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంలో 828.2 అడుగుల వద్ద 47.7648 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత 24 గంటల వ్యవధిలో రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకి 416 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 0.484 మి.యూ., ఉత్పత్తి చేసి 1,095 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 0.291 మి.యూ., ఉత్పత్తి చేసి 638 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్కు వదిలారు.
రామన్పాడులో పెరుగుతున్న నీటిమట్టం
మదనాపురం మండలంలోని రామన్పాడు జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరగుతుంది. 1,021 అడుగులకు గాను శనివారం 1,017 అడుగులకు చేరింది. జూరాల ఎడమ, కుడి కాల్వల ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. కాగా.. ప్రాజెక్టులోని కుడి, ఎడమ కాల్వల ద్వారా 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ చెప్పారు.