
ప్రేమ వ్యవహారంపై రాజకీయ రగడ
కోస్గి: మండలంలోని ఓ గ్రామంలో ప్రేమ వ్యవహారంలో రాజకీయ రగడ మొదలైంది. గ్రామానికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు గత నెల 3న తీసుకెళ్లి రహస్యంగా వివాహం చేసుకున్నాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకొని పారిపోయిన జంటను పట్టుకున్నారు. ఈ క్రమంలో బాలిక మైనర్ కావడంతో పెళ్లి చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి ఈ నెల 30న రిమాండ్కు తరలించారు.
స్నేహితుడి కుటుంబానికి వేధింపులు..
తమ కుమార్తె పారిపోగానే బాలిక కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో బాలిక ఇంటి పక్కనే ఉండే దాయాది కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో పారిపోయిన యువకుడు దాయాది కుటుంబానికి చెందిన యువకుడికి స్నేహితుడని తెలియడంతో బాలిక కుటుంబ సభ్యులు అతడిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు సదరు యువకుడిని అలాగే అతడి తల్లిని స్టేషన్కు పిలిపించి విచారణ జరిపారు. విచారణ అనంతరం గ్రామానికి వెళ్లిన యువకుడి కుటుంబంపై బాలిక కుటుంబ సభ్యులు దాడి చేశారు. పరారైన జంట దొరికినప్పటికీ గ్రామంలోని ఓ నాయకుడి ఆదేశాల మేరకు వలస వెళ్లిన యువకుడి కుటుంబానికి చెందిన ఇంటి తలుపులు పగలగొట్టారు. కరెంట్ మీటర్తోపాటు తాగునీటి నల్లాను ధ్వంసం చేశారు. తన దగ్గరకు వచ్చి రూ.20 వేలు ఇస్తేనే బాగుంటుందని, లేకపోతే అంతు చూస్తానని గ్రామానికి చెందిన ఓ నాయకుడు బెదిరించడంతో ఆ యువకుడు మరోమారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు మాత్రం గ్రామ నాయకుడి ఆదేశాల మేరకు కేసు నమోదు చేయకుండా ధ్వంసం చేసిన ఆస్తులకు మరమ్మతు చేయించాలని రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది.