
రైతులకు తప్పని కష్టాలు
మక్తల్ నియోజకవర్గంలోని వేలాది కృష్ణజింకలు పొలాల్లోకి ప్రవేశించి సాగు చేసిన పంటలను తినేస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ముందస్తు వర్షాలు రావడంతో అన్ని గ్రామాల్లో పత్తి విత్తనాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో జింకల మూలంగా రైతులకు ఇబ్బందులు తప్పేటట్లు లేవు. విత్తనాలు మొలకెత్తిన నాటి నుంచి పంటపై జింకలు దాడి చేస్తుండడంతో ఆ ప్రభావం దిగుబడిపై పడుతుందోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి మొత్తం పంటను నాశనం చేస్తుండడంతో పెట్టుబడులు రాకపోగా చేసినా శ్రమ వృథా అవుతోందని అన్నదాతలు వాపోతున్నారు. ఈ ప్రాంత రైతులను వేధిస్తున్న కృష్ణ జింకల సమస్యను పరిష్కరించాలని కొంతకాలంగా కృష్ణా, మాగనూర్, మక్తల్, ఉట్కూర్ మండలాలకు చెందిన రైతులు పలుమార్లు ఆందోళనలు చేశారు. దీంతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులకు సైతం పలుమార్లు విన్నవించడంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతుల ఇబ్బందులను తొలగించుటకు గతేడాది నిధులు కేటాయించింది. ఈ మండలాల్లో ఉన్న వేలాది కృష్ణ జింకలను ఒకేసారి పట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చు కానీ రానున్న రోజుల్లో వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేసే సంరక్షణ కేంద్రానికి తరలించే అవకాశం ఉండడంతో రైతులకు పూర్తిగా మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేసి తమ కష్టాలను తొలగించాలని ఉమ్మడి మండలాల్లోని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.