
కష్టాలు పలకరించినా..
ఆత్మవిశ్వాసంతో ‘పది’ పరీక్షలకు హాజరు
గద్వాలటౌన్: పదో తరగతి ఫలితాలలో కొందరు విద్యార్థులు ప్రత్యేకత చాటారు. కష్టాలు పలకరించినా కాలానికి ఎదురెళ్లి భళా అనిపించుకున్నారు. ఓ విద్యార్థి తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినా.. దుఃఖాన్ని దిగమింగుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. కంటి చూపు లేకపోయినా.. విధిని ఎదురించి అంధుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి చదువులో ముందంజలో ఉన్నామని నిరూపించారు.
సహాయకుల సహాయంతో పదో తరగతి పరీక్షలు రాసిన అంధుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు(ఫైల్)
అంధత్వం చదువుకోవాలన్న వారిలోని తపనను అడ్డుకోలేకపోయింది. కంటి చూపు లేకున్నా.. ఆరోగ్యం సహకరించకున్నా.. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా ఒక్కో మెట్టు పైకెక్కుతూ ఉన్నత చదువుల దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అన్ని సవ్యంగా ఉన్నా చదువుపై ఆసక్తి చూపని విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. గద్వాల అంధుల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థినీ, విద్యార్థులు సహాయకుల (స్క్రైబ్) సహాయంతో గత నెల పదో తరగతి పరీక్షలు రాశారు. వీరందరూ మొక్కవోని విశ్వాసంతో ఒక్కో తరగతి పూర్తి చేస్తూ ప్రస్తుతం.. పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. 70 శాతానికిపైగా మార్కులు పొందారు. తమలోని లోపాన్ని జయించి మరిన్ని విజయాలు సొంతం చేసుకునే దిశగా వారు ముందడుగు వేశారు. ఈ విద్యార్థులంతా పేద కుటంబానికి చెందిన వారు. ఆత్మ విశ్వాసంతో విద్యపైనే దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన
అంధ విద్యార్థులు
పుట్టెడు దుఃఖంలో పరీక్షకు హాజరైన విద్యార్థి ప్రతిభ