
రెండో రోజూ పడిగాపులే!
కర్నూలు(సెంట్రల్): రేషన్ దుకాణల్లో రెండో రోజు సర్వర్ సమస్య తలెత్తింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్ సక్రమంగా రాకపోవడంతో లబ్ధిదారులు దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. జిల్లాలోని 1,233 రేషన్ దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ కారణంగా కార్డుదారులు షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. జిల్లాలో మొదటిరోజు ఆదివారం 18 శాతం, రెండో రోజు 16 శాతం మంది కార్డుదారులకు మాత్రమే సరుకుల పంపిణీ పూర్తయింది.
క్షణికావేశంలో వివాహిత బలవన్మరణం
పత్తికొండ: స్థానిక కుమ్మరగేరికి చెందిన కుమ్మరి కల్పన (28) క్షణికావేశంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఇళ్లు శుభ్రం చేసే విషయంలో భర్త రాజశేఖర్ఆచారితో చిన్నపాటి వివాదం తలెత్తినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన కల్పన సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ జయన్న తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడి దుర్మరణం
బనగానపల్లె రూరల్: మండలంలోని నందివర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని పలుకూరు గ్రామ సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో చాకలి నాగేశ్ (28) అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బుగ్గానిపల్లె గ్రామానికి చెందిన చాకలి నాగేష్ ట్రాక్టర్ లోడింగ్ పని నిమిత్తం కూలీగా వచ్చారు. ట్రాలీలో నాపరాయి లోడ్ వేసుకొని డ్రైవర్ రామాంజనేయులుతో కలిసి బేతంచెర్ల గ్రామానికి వాహనంలో బయల్దేరారు. పలుకూరు గ్రామ సమీపంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ను తప్పించే క్రమంలో డ్రైవర్ స్టీరింగ్ను తిప్పడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాలీలో కుర్చున్న చాకలి నాగేశ్ కింద పడగా నాపరాళ్లు అతనిపై పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య రమాదేవి, ఇద్దరు సంతానం ఉన్నారు.

రెండో రోజూ పడిగాపులే!