
ఇళ్ల స్థలాలు ఇచ్చి హామీ నిలుపుకోవాలి
నంద్యాల(న్యూటౌన్): సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట ప్రకారం సొంతిల్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని, అలాగే సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేంత వరకు సీపీఐ పోరాటం ఆగదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల సీపీఐ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రామకృష్ణ మాట్లాడారు. జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుందని, ఇప్పటివరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. చేత కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేసి ఇంత వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తల్లికి వందనం, మహిళలకు నెలకు రూ.1500, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ వెంటనే అమలు చేయాలన్నారు. రేషన్ పంపిణీలో అక్రమాలకు తవిచ్చేలా వాహనాలను రద్దు చేసి మళ్లీ షాపులను తీసుకురావడం మంచిపద్ధతి కాదన్నారు. అనంతరం సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ.. పట్టణంలో ఇళ్లు లేని 13 వేల మంది లబ్ధిదారులను గుర్తించామని, ఇప్పటివరకు 2470 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వారందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే వరకు సీపీఐ పోరాటం చేస్తుందన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.