
పాముకాటుతో మహిళ మృతి
బేతంచెర్ల: మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో ఓ మహిళ సోమవారం పాముకాటుకు గురై మృతి చెందింది. వివరాలు.. గ్రామానికి చెందిన తవిసి కొండ తిమ్మయ్య భార్య రంగమ్మ (46) గ్రామంలో వేరుశనగ పంట తొలగింపు పనులకు వెళ్లి పైరును తొలగిస్తుండగా చేతికి పాముకాటు వేసింది. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం బేతంచెర్ల సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి నలుగురు సంతానం ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
కర్నూలు: కర్నూలు బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లడంతో రెండు కాళ్లు విరగడంతో పాటు తలకు ఎడమ వైపు తీవ్ర గాయాలతో వ్యక్తి రోడ్డుపై పడిఉన్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని ఆసుపత్రి ఆవరణలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. మృతుడి వయస్సు 47 సంవత్సరాలు ఉంటుందని, 5.5 అడుగుల ఎత్తు, ఛామన చాయ రంగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నీలం, పసుపు రంగు గీతలు కలిగిన రెడీమేడ్ ఫుల్ షర్టు, ఎరుపు రంగు గీతలు కలిగిన లేత నీలి రంగు నిక్కర్ ధరించాడు. ఆచూకీ తెలిసినవారు 91211 01078 నంబర్కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.