నిర్వహణ ‘మరుగు’న పడి | - | Sakshi
Sakshi News home page

నిర్వహణ ‘మరుగు’న పడి

Jun 3 2025 5:37 AM | Updated on Jun 3 2025 5:37 AM

నిర్వ

నిర్వహణ ‘మరుగు’న పడి

పాఠశాల విద్యలో గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు జీఓ 117 తీసుకొచ్చి 6 రకాల బడులను ఏర్పాటు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే 117 జీఓను రద్దు చేస్తామనే ప్రచారం చేసింది. అయితే ఎన్డీఏ కూటమిలో ఆ జీఓను రద్దు చేసేందుకు ఆస్కారం లేకపోవడంతో ప్రత్యామ్నాయానికి తెరతీసింది. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పేరిట 6 రకాల బడులను 9 రకాలుగా మార్పు చేస్తూ గందరగోళానికి పాల్పడుతోంది. వాస్తవానికి 2017 అప్పటి ఇదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓలు 29, 42 కారణంగా ప్రాథమిక విద్య నిర్వీర్యమైంది. ఫలితంగా అప్పట్లో జిల్లాలో 79 స్కూళ్లు మూతపడ్డాయి.

అమలుకాని తల్లికి వందనం

ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం కింద ఒక్కొక్కరికీ రూ.15 వేలు ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అదిగో.. ఇదిగో అంటూ బడ్జెట్‌ సమావేశాల్లో ఏప్రిల్‌, మే నెల చివరిలో ఇస్తామని మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్‌ అంసెబ్లీలో మాటిచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులకే జూన్‌లో స్కూళ్లు పునఃప్రారంభం అయ్యాక ఇస్తామని నాలుక మడతేయడం గమనార్హం.

కొండలా ఫీజు బకాయిలు

పేద విద్యార్థుల చదువులకు ఫీజులు భారం కాకూడదని యూనివర్సిటీలలో ఎంత ఫీజులు ఉంటే అంత మొత్తాన్ని జగనన్న విద్యా దీవెన కింద తల్లిదండ్రులపై నయాపైసా భారం పడకుండా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. విశ్వ విద్యాలయాలు నిర్ణయించిన ఫీజు మొత్తాన్ని అప్పటి ప్రభుత్వమే చెల్లించింది. అయితే నేడు కోర్సు పూర్తయినా ఫీజు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు అందక కొందరు, పరీక్షలు రాయలేక మరి కొందరు మధ్యలోనే చదువులు మానేయాల్సిన దుస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్‌ బకాయిలు చెల్లించకపోగా 2024–25 ఏడాదిలో చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సుమారు రూ.34 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2023–24 ఫీజులు సుమారు రూ.71 కోట్ల బకాయి ఉంది.

అరకొరగానే విద్యా కానుక

తల్లిదండ్రులకు పిల్లల చదువులు భారం కాకుడదని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వై.ఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక జగనన్న విద్యా కానుక పేరిట కిట్ల రూపంలో యూనిఫాం, పుస్తకాలు, బ్యాగ్‌లు, బూట్లు, బెల్ట్‌, డిక్షనరీలు, సాక్సులు, నోట్‌ పుస్తకాలను అందజేశారు. ఏటా సుమారు 2.90 లక్షల మంది విద్యార్థులకు ఒక్కో కానుక కిట్టు రూ.2 వేల ప్రకారం రూ.2 వేల కోట్లకుపైగా ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర యాప్‌ పథకంగా మార్పు చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పుస్తకాలు, కిట్లలోని వస్తువులు చేరని పరిస్థితి. బ్యాగ్‌లు ఒక్క మండలానికి మాత్రమే రాగా.. బూట్లు, పిక్టోరియల్‌ రిక్షనరీల ఊసే కరువైంది.

నాణ్యత లేని మధ్యాహ్న భోజనం

కూటమి ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకానికి డొక్కా సీతమ్మ మద్యాహ్న బడి భోజనంగా మార్పు చేసింది. గత ప్రభుత్వం అమలు చేసిన మెనూను కొనసాగిస్తున్నా నాణ్యతను విస్మరించింది. వంట ఏజెన్సీలను ఎలాంటి కారణం లేకుండా తొలగించి టీడీపీ వర్గీయులకు కట్టబెట్టడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇంటర్‌ పిల్లలకు మద్యాహ్న భోజనం పెడతామని ఈ ఏడాది జనవరి నుంచి మొదలు పెట్టినా ఇప్పటి వరకు ఏజెన్సీలకు బిల్లులు చెల్లించకపోవడం గమనార్హం.

టాయ్‌లెట్ల నిర్వహణ అస్తవ్యస్తం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బాల, బాలికలకు వేర్వేరుగా అత్యాధునిక మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని ప్రతి రోజూ శుభ్రం చేసేందుకు 1,741 మంది ఆయాలను నియమించారు. శుభ్రం చేసేందుకు అవసరమైన రసాయనాలను సైతం పంపిణీ చేస్తూ ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ చేశారు. అయితే కూటమి ప్రభుత్వంలో టాయ్‌లెట్ల నిర్వహణ అధ్వానంగా మారింది. జిల్లాలోని 240 ఉన్నత పాఠశాలల్లో నైట్‌ వాచ్‌మెన్లకు ఈ ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు చెల్లించని పరిస్థితి నెలకొంది.

‘చిక్కీ’పోయిన మాధ్యాహ్న భోజనం

ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. జిల్లాలోని 23 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో జనవరి నెల నుంచి అమలు చేస్తున్నారు. ఇందుకు రూ.20 లక్షలకుపైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్‌ 1నుంచే 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభించారు. కానీ విద్యార్థులకు కోడి గుడ్లు, చిక్కీలు ఇవ్వలేదు.

తరగతి గది

అధోగతి!

కార్పొరేట్‌

చేతిలో

సెకండరీ

విద్య

డిజిటల్‌ విద్యకు గ్రహణం

జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 1,436 ఉన్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో బాల, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లను నిర్మించింది. వీటిని ప్రతి రోజు శుభ్రం చేసేందుకు 1,741 మంది ఆయాలను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా మారింది. ఆయాలకు గతంలో రెగ్యులర్‌ వేతనాలు వచ్చేవి. నేడు మూడు, నాలుగు నెలలు అయినా అందని పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన మన బడి నాడు–నేడు కార్యక్రమానికి గ్రహణం పట్టింది. అప్పట్లో జిల్లాలో మొదటి విడతలో 594 పాఠశాలల్లో రూ.166.25 కోట్లు ఖర్చు చేశారు. రెండో విడతలో 1,051 స్కూళ్లలో రూ.504.16 కోట్లతో పనులు చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో ఏడాదిగా పనులు నిలిచిపోయాయి. అదనపు తరగతి గదుల పనులు పునాదులకే పరిమితం అయ్యాయి.

జిల్లాలోని 90 స్కూళ్లను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సీబీఎస్‌ఈ స్కూళ్లుగా మార్చగా, కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ఆంగ్ల మాధ్యమాన్ని పేద విద్యార్థులకు దూరం చేసేందుకు కుట్ర చేస్తోంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట్రాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌(ఐఎఫ్‌పీ) ద్వారా డిజిటల్‌ విద్యను పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్యాబ్‌లతో పాటు, బైజుస్‌ డిజిటల్‌ కంటెంట్‌ను చేరువ చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో వీటిని పట్టించుకోకపోగా.. ట్యాబ్‌ల పంపిణీని నిలిపేసింది.

ఇంటర్మీడియెట్‌లో సంస్కరణల పేరిట గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటర్మీడియెట్‌ విద్యా మండలిలో నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్‌ను సభ్యులుగా నియమించి సెకండరీ విద్యను కార్పొరేట్‌కు తాకట్టు పెట్టింది కూటమి ప్రభుత్వం. ఈ ఏడాది నుంచి ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను అమలు చేస్తామని.. కాలేజీలు పునఃప్రారంభం రోజు నాటకి కొత్త పాఠ్యపుస్తకాలు ఇస్తామని గొప్పలు చెప్పుకున్నారు. అయితే ఇంత వరకు ఒక్క పాఠ్య పుస్తకం కూడా అందించలేకపోయారు.

నిర్వహణ ‘మరుగు’న పడి 
1
1/5

నిర్వహణ ‘మరుగు’న పడి

నిర్వహణ ‘మరుగు’న పడి 
2
2/5

నిర్వహణ ‘మరుగు’న పడి

నిర్వహణ ‘మరుగు’న పడి 
3
3/5

నిర్వహణ ‘మరుగు’న పడి

నిర్వహణ ‘మరుగు’న పడి 
4
4/5

నిర్వహణ ‘మరుగు’న పడి

నిర్వహణ ‘మరుగు’న పడి 
5
5/5

నిర్వహణ ‘మరుగు’న పడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement