
ఆర్యూలో కొత్త కోర్సులు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రీషన్, నాలుగు సంవత్సరాల బీకాం కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులను ప్రవేశ పెడుతున్నట్లు వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు తెలిపారు. సోమవారం వర్సిటీలోని వీసీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వర్సిటీ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వీసీ వివరించారు. క్వాంటమ్ టెక్నాలజీ, పునరుత్పాదక శక్తి వనరులు(రెనేబుల్ ఎనర్జీ), డ్రోన్ టెక్నాలజీలకు సంబంధించి క్యాంపస్ విద్యార్థులకు సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించనున్నామన్నారు. పరిశోధనలను ప్రోత్సహించడంలో భాగంగా సెమినార్లు, కాన్ఫరెన్స్లతో పాటు విద్యార్థులు, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ప్రతి డిపార్ట్మెంట్కు రూ.50 వేల నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. వివిధ పీజీ కోర్సులతో పాటు, ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకులు కొరతను అధిగమించడానికి తాత్కాలిక అధ్యాపకులను నియమిస్తామన్నారు. ఇంజినీరింగ్ కళాశాల, కంప్యూటర్ సైన్స్, ఏఐ విభాగాల్లో రూ.2 కోట్లతో అధునాతన ల్యాబ్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే పీజీ సెమిస్టర్ పరీక్షల నుంచి ఆన్లైన్ వా ల్యుయేషన్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నామన్నారు. వర్సిటీ పునః ప్రారంభమయ్యాక టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగులకు ఫేషియల్/ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశ పెడతామన్నారు. రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్ నాయుడు, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.