
రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కలెక్టరేట్తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ప్రజల ఫిర్యాదులను స్వీరిస్తారని ఆయన పేర్కొన్నారు.
పవన్ వ్యాఖ్యలపై ముస్లింల ఆగ్రహం
● నేడు కర్నూలులో ధర్నా
కర్నూలు(సెంట్రల్): ‘ముస్లమాన్లందరూ టెర్రరిస్టులే’ అన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింల చరిత్ర తెలియక లేనిపోని వ్యాఖ్యలు చేయడం ఆయనకు భావ్యం కాదన్నారు. డిప్యూటీ సీఎం మాటలను నిరసిస్తూ ఆదివారం ఉదయం 10 గంటలకు కర్నూలులోని జమ్మిచెట్టు దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ముస్లిం సంఘాల జేఏసీ నాయకుడు ఎస్ఎండీ షరీఫ్ తెలిపారు.
ఎంపీహెచ్ఏల కౌన్సెలింగ్ వాయిదా
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(మేల్)ల కౌన్సెలింగ్ వాయిదా పడింది. శనివారం నిర్వహించాల్సిన రీ డిప్లాయ్మెంట్ కౌన్సెలింగ్లో పలువురు హెల్త్ అసిస్టెంట్లు కొన్ని సందేహాలను లేవనెత్తారు. అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లాగా జాబితాను వేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని, ఇక్కడ మాత్రమే కేవలం కర్నూలు జిల్లా జాబితాను తయారు చేశారని చెప్పారు. దీంతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వివరణ తీసుకుని డీఎంహెచ్వో డాక్టర్ పి.శాంతికళ కౌన్సెలింగ్ను వాయిదా వేశారు.
ముగ్గురికి జూనియర్
అసిస్టెంట్లుగా పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని వివిధ జెడ్పీ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు రికార్డు/లైబ్రరీ/ ల్యాబ్ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. వీరిని మండల పరిషత్ కార్యాలయాలు, పాఠశాలలకు కేటాంచినట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి తెలిపారు. ఎన్.కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్లో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎస్.వీరశేఖర్రాజును జెడ్పీహెచ్ఎస్ బలపనూరుకు, దేవనకొండ నుంచి ఎం.అన్వర్సాదత్ను జూపాడుబంగ్లా ఎంపీపీ కార్యాలయానికి, బనగానపల్లె నుంచి ఎస్.జాకీర్హుసేన్ను ఎంపీపీ కోవెలకుంట్లకు పదోన్నతిపై బదిలీ చేసినట్లు సీఈఓ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లాలో వాహన తనిఖీలు
కర్నూలు: జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్లు వాహన తనిఖీలు నిర్వహించారు. రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, బైకులు నడిపేవారు కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని తనిఖీల సందర్భంగా అవగాహన కల్పించారు. ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్తో వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీ నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై 170 కేసులు నమోదు చేశారు.
అక్రమ కుళాయి కనెక్షన్ తొలగింపు
ఆలూరు: మొలగవెల్లి గ్రామంలో దేవాలయ నీటిని టీడీపీ నాయకుడు ఇంటికి తరలిస్తుండగా అధికారులు స్పందించారు. మంచినీటి కుళాయి కనెక్షన్ను శనివారం తొలగించారు. భక్తులకు ఇచ్చే నీటిని అక్రమ కనెక్షన్తో టీడీపీ నాయకుడు తన ఇంటికి తరలిస్తున్నాడు. ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం వార్త ప్రచురితం కావడంతో జిల్లా, డివిజనల్ పంచాయతీ అధికారులు స్పందించారు. వెంటనే కుళాయి కనెక్షన్ తొలగించాలని పంచాయతీ కార్యదర్శి వెంకటనాయుడిని ఆదేశించారు. పంచాయతీ సిబ్బంది రామాంజనేయులుతో కలసి కుళాయి కనెక్షన్ తొలగించారు.