
● ప్యాపిలి మండలంలో 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గతంలో ప్రతి వేసవి కాలం సీతమ్మ తండా, అలేబాదు తండా, వెంగళాంపల్లి, మునిమడుగు, డి.రంగాపురం, ప్యాపిలిలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తేది. ట్యాంకర్లతో ప్రజలకు నీటిని సరఫరా చేసేవారు. అయితే నాలుగేళ్ల నుంచి ఈ కష్టాలు తీరాయి. వర్షాలు సమృద్ధిగా కురవడంతో భూగర్భజలాలు పెరిగి ట్యాంకర్ల అవసరం రావడం లేదు.
● హొళగుంద మండలంలో ప్రతి వేసవిలో ఎల్లార్తి, గజ్జహళ్లి మంచి నీటి పథకాలు ఎండిపోయేవి. ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. నాలుగేళ్ల నుంచి సమృద్ధిగా వర్షాలు కురవడం, తుంగభద్ర దిగువకాలువకు రబీ సీజన్లో సైతం నీరు రావడంతో నీటి కష్టాలు గట్టెక్కాయి. ట్యాంకర్ల అవసరం లేకుండా ఈ పథకాల కింద 12 గ్రామాల ప్రజల దాహార్తి తీరుతోంది.
.. పై రెండు మండలాలే కాదు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంచినీటి సమస్య 98 శాతం తొలగిపోయింది. వరుణుడి కరుణ, రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ప్రజలు వేసవిలో నీటి కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా పోయింది.
● సమృద్ధిగా కురిసిన వర్షాలతో పెరిగిన
భూగర్భ జలాలు
● ఏప్రిల్, మే నెలల్లో కురిసిన
వర్షాలతో రీచార్జ్ అయిన బోర్లు
● గతంలో ఉమ్మడి జిల్లాలో
200లకు పైగా గ్రామాల్లో నీటి ఎద్దడి
● ప్రస్తుతం రెండు గ్రామాల్లోనే
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
కర్నూలు(అర్బన్): వేసవిలో ప్ర‘జల’ కష్టాలు తొలగాయి. భారీ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో మే నెల ప్రారంభమైనా మెజారిటీ ప్రాంతాల్లోని నీటి వనరులు కళకళలాడుతున్నాయి. ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు ముందస్తుగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. నాలుగేళ్ల క్రితం ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు అంతంత మాత్రంగా కురిసేవి. వేసవి వచ్చిందంటే దాదాపు 200కు పైగా గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి తలెత్తేది. అనేక గ్రామాల ప్రజలు కిలోమీటర్లు ప్రయాణించి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేది. అయితే 2019 నుంచి వర్షాలకు విరివిగా కురిసి వివిధ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, కాలువల్లో నీరు పుష్కలంగానే ఉంది. అయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఏడాది వేసవిలో జిల్లాలో 107 గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉంటుందని ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు అంచనాకు వచ్చారు. వీటికి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు రూ.8.08 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. అయితే ఏప్రిల్ ఆఖరి వారంలో, అలాగే మే నెలలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఆయా ప్రాంతాల్లోని బోర్లు తిరిగి రీచార్జ్ అయ్యాయి. ప్రస్తుతం ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె, తిప్పాయిపల్లె గ్రామాలకు మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు.
జెడ్పీ నుంచి రూ.2.65 కోట్లు
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుత వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు జిల్లా పరిషత్ నుంచి రూ.2.65 కోట్లు కేటాయించారు. ఒక్కో జెడ్పీటీసీ సభ్యుడికి రూ.5 లక్షల ప్రకారం నిధులను అందించేందుకు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆయా జెడ్పీటీసీ సభ్యుల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజినీరుకు పంపి ఆయా పనులను చేపట్టేందుకు కార్యాచరణను రూపొందించారు.
తాజాగా రూ.40.10 కోట్లతో టెండర్లు
జిల్లాలోని 32 సమగ్ర రక్షిత మంచి నీటి పథకాల నిర్వహణకు సంబంధించి తాజాగా రూ.40.10 కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. ఇందులో ఆదోని డివిజన్లో మొత్తం 25 మంచినీటి పథకాలు ఉన్నాయి. వీటిలో 23 పథకాలకు జిల్లా స్థాయిలో టెండర్లు దాఖలు కాగా, ఒక్క పథకానికి మాత్రం చీఫ్ ఇంజినీరు స్థాయిలో టెండర్లు జరగనున్నాయి. అలాగే కర్నూలు డివిజన్లోని 7 మంచి నీటి పథకాల నిర్వహణకు సంబంధించిన టెండర్లు సీఈ స్థాయిలో జరగనున్నాయి.
ఆశాజనకంగా భూగర్భ జలాలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉన్నాయి. గత డిసెంబర్ నెలలో జిల్లా మొత్తం సగటున 5.42 మీటర్లలో భూగర్భజలాలు లభించడం విశేషం. జనవరిలో కర్నూలు జిల్లాలోని ఐదు మండలాల్లో 3 మీటర్లు, 15 మండలాల్లో 3 నుంచి 8 మీటర్లు, ఐదు మండలాల్లో 8 నుంచి 20 మీటర్లలో లభ్యమయ్యాయి. గతంలో గోనెగండ్ల 3, కోసిగి 9, ఓర్వకల్లు 1, వెల్దుర్తి మండలంలో 1 చొప్పున మొత్తం 14 గ్రామాల్లో భూగర్భజలాలను 100 శాతం వినియోగించేవారు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగి, వినియోగం తగ్గింది. దీంతో ఆయా గ్రామాల్లో బోర్లపై నిషేధాన్ని తొలగించారు.

చింతకుంట రిజర్వాయర్లో నిల్వ ఉన్న నీరు