
పేద బిడ్డల
కూటమి ప్రభుత్వానికి మొదటి నుంచీ పేదలంటే చిన్నచూపు. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులకు ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ కోచింగ్ సహా ఇంటర్మీడియెట్ విద్య నేర్పే గురుకుల కళాశాల భవనానికి అద్దె కట్టడం ఎందుకు దండగ అన్న దృక్పథంతో ఈడుపుగల్లులో ఉన్న కళాశాలను మూసేసింది. ఆ కళాశాలను ప్రస్తుతం జి.కొండూరు మండలం కుంటముక్కలలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనంలోకి తరలిస్తోంది. ఎప్పుడు కూలుతుందో తెలియని భవనం... వరద ఎలా ముంచుకొస్తుందోనన్న భయం మధ్య చదువులు సాగేదెలా అని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
జి.కొండూరు: రాష్ట్రంలోనే ఏకై క బాలికల ఐఐటీ, ఎన్ఐటీ అకాడమీని కూటమి ప్రభుత్వం అర్థంతరంగా మూసేసింది. దళిత, గిరిజన, బలహీన వర్గాల బిడ్డలు చదువుకునే ఆ గురుకులానికి అద్దె భారమైందని కూటమి ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోంది. కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు అకాడమీని మూసేయడంతో 280 మంది పిల్లల చదువుల భవితవ్యం రోడ్డున పడింది. ముందస్తు ప్రణాళిక లేకుండా వేసవి సెలవుల్లో కాలయాపన చేసిన అధికారులు ఇప్పుడు హడావుడిగా కుంటముక్కలలో ఉన్న పాత భవనాలకు మరమ్మతులు చేపడుతున్నారు.
పాత భవనానికి మరమ్మతులు...
కుంటముక్కల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుంచి ఇంటర్ వరకు 640 మంది విద్యార్థులు ఏటా చదువుతుంటారు. ఈ విద్యార్థులు ఉండే వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనంలోకి మార్చారు. వీరికి విద్యాబోధనతో పాటు వసతి గృహం సైతం ఇదే భవనంలో నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈడుపుగల్లు ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థినులకు సైతం ఇక్కడ వసతి కల్పించాల్సి రావడంతో గత ఎనిమిదేళ్లుగా వినియోగంలో లేని పాత భవనానికి హడావుడిగా మెరుగులు దిద్దుతున్నారు. ఈ భవనాన్ని 1984లో నిర్మించారు. ఇది దాదాపు శిథిలావస్థకు చేరి ఇప్పటికే స్లాబు పెచ్చులు ఊడి పడుతోంది. ఈ భవనంలో కొంత భాగం కూలే ప్రమాదం ఉందని తెలిసి దానిని తొలగించారు. పెచ్చులూడుతున్న చోట కెమికల్ ట్రీట్మెంట్ చేసి సరిపెడుతున్నారు. ఈ శిథిల భవనానికి రూ.33 లక్షలతో మరమ్మతులు చేసి ఐఐటీ, ఎన్ఐటీ అకాడమీ విద్యార్థినులకు కేటాయించేందుకు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థినులకు రక్షణ కరువు..
కుంటముక్కల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక ఇప్పుడు ఉన్న విద్యార్థినులే నరకయాతన పడుతున్నారు. వసతి గృహం లేక తరగతి గదుల కోసం నిర్మించిన భవనంలోనే ఉంటున్నారు. పాఠశాలకు మూడొంతులు ప్రహరీ లేక విద్యార్థినులు బిక్కుబిక్కు మంటూ ఉండాల్సి వస్తోంది. సరిపడా టాయిలెట్లు లేవు. అంతర్గత రహదారులు లేవు. తాగునీటి వసతి అంతంతమాత్రం. ఉపాధ్యాయులు నివాసం ఉండే భవనాలు కూడా శిథిలావస్థకు చేరడంతో పాఠశాలలోనే ఉండాల్సిన ఉపాధ్యాయులు పరిసర ప్రాంతాలలో ఇళ్లను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఐఐటీ, ఎన్ఐటీ అకాడమీ విద్యార్థినులను ఇక్కడకు తరలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రయివేటు భవనానికి అద్దె
కట్టలేమంటూ ఈడుపుగల్లులో ఐఐటీ, నీట్ అకాడమీ మూసివేత
కుంటముక్కలలో శిథిల
భవనంలోకి తరలింపు యత్నం
హడావుడిగా పాత భవనానికి
మరమ్మతులు
ప్రహరీ లేని భవనంలో
విద్యార్థినులకు రక్షణ ప్రశ్నార్థకం
పక్కనే వాగు ఉండడంతో
వరద ముంపు ప్రమాదం
పెచ్చులు ఊడి ప్రమాదకరంగా
దర్శనమిస్తున్న శ్లాబు

పేద బిడ్డల