విజయవాడకు మెట్రో మరో మణిహారం | - | Sakshi
Sakshi News home page

విజయవాడకు మెట్రో మరో మణిహారం

Jun 14 2025 6:38 AM | Updated on Jun 14 2025 6:38 AM

విజయవాడకు మెట్రో మరో మణిహారం

విజయవాడకు మెట్రో మరో మణిహారం

● భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సమగ్ర రవాణా ప్రణాళిక ● ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): మెట్రో రైలు ప్రాజెక్టు విజయవాడకు మరో మణిహారం కానుందని, భాగస్వామ్య పక్షాల సలహాలు, సూచనలకు కూడా ప్రాధాన్యమిస్తూ విజయవాడ సమగ్ర రవాణా ప్రణాళిక (సీఎంపీ)కు తుది రూపు ఇవ్వనున్నామని కలెక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. మెట్రో రైలు ప్రాజెక్టు సహా విజయవాడ సమగ్ర రవాణా ప్రణాళికపై శుక్రవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కృష్ణాజిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర హెచ్‌ఎం, ఏపీఎంఆర్‌సీఎల్‌ డెప్యూటీ సీజీఎం పి.రంగారావు హాజరైన ఈ సమావేశంలో తొలుత సిస్ట్రా ఎంవీఏ కన్సల్టింగ్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి అంకుశ్‌ మల్హోత్రా సీఎంపీ ముసాయిదాను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. వచ్చే 25–30 సంవత్సరాల నగర అవసరాలను సైతం పరిగణనలోకి తీసుకుని రూపొందించే దార్శనిక ప్రణాళికను సీఎంపీగా పేర్కొంటామని, విజయవాడ ప్రణాళికకు సంబంధించి ట్రాఫిక్‌, కుటుంబ సర్వేను పూర్తిచేశామన్నారు. భౌగోళిక స్థితిగతులు, ట్రాఫిక్‌, రవాణా పరిస్థితులు, రవాణా మౌలిక వసతులు, భవిష్యత్తు జనాభా, ట్రావెల్‌ డిమాండ్‌ తదితరాల ఆధారంగా సీఎంపీ ముసాయిదాకు రూపకల్పన చేశామన్నారు. విజయవాడతో పాటు పరిసర ప్రాంతాలకు సంబంధించి రహదారుల నెట్‌వర్క్‌, ప్రజా రవాణా, మార్గాలు, రిజిస్టర్డ్‌ వాహనాలు తదితర అంశాలతో పాటు రహదారి ప్రమాదాలను సైతం విశ్లేషించినట్లు వివరించారు. కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ నవ రాజధాని అమరావతికి గేట్‌వేగా ఉన్న విజయవాడ సమగ్రాభివృద్ధిలో భాగంగా జనాభా అవసరాలకు అనుగుణంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో కాంప్రెహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ రూపకల్పన తుదిదశకు చేరు కుందని తెలిపారు. జాతీయ రహదారులు, ఆర్‌ అండ్‌ బీ, పోలీస్‌, ఆర్‌టీసీ, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ, నగరపాలక సంస్థ తదితర భాగస్వామ్య పక్షాల సలహాలు, సూచనలు తీసుకునేందుకు వీలుగా ఈ సమావేశం నిర్వహించినట్లు వివరించారు. మెట్రో రైలు ప్రాజెక్టు విజయవాడ నగరానికి గొప్ప ఆస్తి అని, ఫేజ్‌–1 కారిడార్‌ 1ఏ (గన్నవరం–పీఎన్‌బీ ఎస్‌), కారిడార్‌ 1బీ (పీఎన్‌బీఎస్‌–పెనమలూరు) భూ సేకరణ ప్రక్రియకు నిబంధనలకు అను గుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. కృష్ణాజిల్లా పరిధిలోని మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల్లో అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాలాజీ తెలిపారు. సమావేశంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ఎం ఎల్‌కే రెడ్డి, డీసీపీ ఎం.కృష్ణమూర్తి నాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement