
చేపల వేటకు వేళాయె!
మచిలీపట్నంఅర్బన్: మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వేళయింది. ప్రభుత్వం విధించిన చేపల వేట నిషేధం శనివారంతో ముగియనుంది. దాంతో శనివారం అర్ధరాత్రి నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు బోట్లు, వలలు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ బోసిపోయిన సముద్ర తీరం మళ్లీ సందడిగా మారనుంది. గతేడాది మత్స్యకారులకు సముద్రం వేట కలిసిరాలేదు. 2024 జూన్లో వేట మొదలు పెట్టిన వెంటనే వరుసగా తుపానులు, అల్పపీడనాలతో సముద్రంలోకి వెళ్లిన బోట్లు పట్టుమని ఒకటి, రెండు రోజులు కూడా వేట సాగించకుండా తీరానికి చేరాల్సి వచ్చింది. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాకుండా నష్టాలు చవిచూశారు. దీనికి తోడు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ గత ఏడాది వేట నిషేధ సాయం అందించలేదు. దాంతో మత్స్యకారులు అప్పులపాలయ్యారు. నిషేధం అనంతరం రెండు నెలల పాటు సముద్రంలో అపారంగా మత్స్య సంపద దొరుకుతుందని మత్స్యకారులు నమ్ముతారు. ఈ ఏడాదైనా ప్రకృతి కరుణించాలని గంగపుత్రులు వేడుకుంటున్నారు.
61 రోజుల పాటు వేట నిషేధం
సముద్రంలో చేపల వేటను నిషేధిస్తూ ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సముద్రంలో చేపలు, రొయ్యలు సంతాన ఉత్పత్తి, మత్స్యసంపద అభివృద్ధి కోసం నిషేధం విధించింది. తూర్పు తీరంలో అత్యధిక చేప జాతులు సంతానోత్పత్తి ఈ సమయంలోనే చేస్తాయి. అందుకే మరబోట్లు మెకనైజ్డ్ బోట్లు, మోటారు బోట్లతో సముద్రంలోకి వెళ్లడంపై ప్రభుత్వం నిషేధం విధించింది.
2025–26 వేట నిషేధ భృతి ఇలా...
జిల్లాలో 111 కి.మీ సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. నాలుగు మండలాలలోని 64 మత్స్యకార గ్రామాల్లో మొత్తం 2,50,106 మంది మత్స్యకారులు చేపల వేట వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లేందుకు ఉపయోగించే మెకనైజ్డ్ బోట్లు 66కు గాను 500 మంది మత్స్యకారులు, మోటరైజ్డ్ బోట్లు 2,126కు గాను 12,365 మంది, నాన్ మోటరైజ్డ్ బోట్లు 71కు గాను 206 మంది మత్స్యకారులను వేట నిషేధ భృతికి అర్హులుగా ఎంపిక చేశారు. డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
గతేడాది బకాయిలకు ఎగనామం
నేటి అర్ధరాత్రి నుంచి
సముద్రంలో చేపల వేట ప్రారంభం
బోట్లను సిద్ధం చేసుకుంటున్న
మత్స్యకారులు
గత ఏడాది వేట నిషేధ భృతి
బకాయిలు తీర్చని కూటమి సర్కార్
జిల్లాలో 12,809 మందికి
రూ.12.89 కోట్లు ఎగనామం
ఈ ఏడాది 13,077 మందికి
రూ.26.15 కోట్ల పంపిణీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతేడాది వేట నిషేధ భృతి బకాయిలు ఎగనామం పెట్టింది. 2023–24లో వేట నిషేధ భృతి కింద కృత్తివెన్ను, నాగాయలంక, మచిలీపట్నం, కోడూరు తీరప్రాంతాల్లో 12,748 మంది మత్స్యకారులను అర్హులుగా ప్రతిపాదించారు. వేట నిషేధ భృతి కింద 12,151 మంది బ్యాంక్ ఖాతాల్లోకి వైఎస్సార్ సీపీ హయాంలో రూ.10 వేలు చొప్పున నేరుగా రూ.12.15 కోట్లు జమ చేశారు. 2024–25 వేట నిషేధ భృతి కింద 12,809 మంది మత్స్యకారులను గుర్తించారు. సుమారు 12.89 కోట్లు ఇవ్వాల్సి ఉంది. గతేడాది ఎన్నికల కోడ్ రావడంతో భృతి అందలేదు. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు వేట నిషేధభృతి రూ.20 వేలు ఇస్తామంటూ వాగ్దానాలు చేసింది. అయితే గతేడాది ఇవ్వవలసిన బకాయిలకు మొండిచేయి చూపింది.