
రైతులకు సులభంగా విత్తనాలు అందించటమే లక్ష్యం
వ్యవసాయం, సహకార శాఖ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి రాజశేఖర్
భవానీపురం(విజయవాడపశ్చిమ): విత్తన పంపిణీ విధానాన్ని మెరుగుపరిచి, రైతులకు సులభంగా విత్తనాలను అందించడమే లక్ష్యంగా రైతు సేవా కేంద్రాలను సందర్శిస్తున్నామని వ్యవసాయం, సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. వ్యవసాయ శాఖ సంచాలకుడు ఢిల్లీరావుతో కలిసి శుక్రవారం ఆయన గొల్లపూడి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులతో ముఖాముఖి చర్చలు జరిపి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత విత్తన పంపిణీలో వినియోగిస్తున్న డి కృషి యాప్ ద్వారా చేపట్టిన విత్తనాల పంపిణీ ప్రామాణిక విధానాన్ని (ఎస్ఓపీ) పరిశీలించడంతోపాటు పంపిణీలో పరిపాలన, సాంకేతిక విభాగాల సమన్వయాన్ని అధ్యయనం చేసేందుకు వచ్చామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు సంచాలకుడు (విత్తనాలు) వినయ్ చంద్, జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి, విజయవాడ సహాయ సంచాలకుడు బీవీ రావు, ఏపీ సీడ్స్ విజయవాడ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు వరి, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ జరిగింది.
విమాన ప్రమాద మృతులకు వైద్య ఉద్యోగుల నివాళి
లబ్బీపేట(విజయవాడతూర్పు): అహ్మదాబాద్ లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారికి ఎన్టీఆర్ జిల్లా వైద్యశాఖ ఉద్యోగులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తో పాటు వైద్య ఉద్యోగులు శుక్రవారం సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ ఈ ఘటనలో వైద్య విద్యార్థులు కూడా మృతి చెందడం మరింత బాధాకరమన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ విభాగాలు ఎయిడ్స్ అండ్ లెప్రసీ, టీబి, ఎన్.హెచ్.ఎం, ఎస్టాబ్లిష్మెంట్ ఇతర విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
మెగా డీఎస్సీ పరీక్షలు
మచిలీపట్నంఅర్బన్: కృష్ణాజిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో మెగా డీఎస్సీ పరీక్షలు శుక్రవారం కొనసాగాయి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 1030 అభ్యర్థులకు గాను 963 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐదు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 1,433 మందికి గాను 1,403 మంది హాజరయ్యారు.
సచివాలయాల్లో తల్లికి
వందనం జాబితాల ప్రదర్శన
ఈ నెల 20 వరకు
అభ్యంతరాలు, అర్జీల స్వీకరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో తల్లికి వందనం పథకానికి 2,13,846 మంది విద్యార్థులు, 1,41,999 మంది తల్లులు అర్హత సాధించారని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులతోపాటు అనర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించామన్నారు. వీటిపై ఈ నెల 20వ తేదీ వరకు అభ్యంతరాలు, అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు అర్జీలను పరిశీలించి, అనుబంధ అర్హుల జాబితాను రూపొందిస్తామన్నారు. ఈ నెల 30వ తేదీన పథకానికి అర్హులైన మొదటి తరగతి, జూనియర్ ఇంటర్ విద్యార్థుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. కొత్తగా అర్హత సాధించిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జూలై 5న నిధులు జమవుతాయని వివరించారు. విద్యుత్ వినియోగం, రైస్ కార్డు, కుటుంబ ఆదాయం, కుటుంబానికి ఉన్న భూమి, మునిసిపల్ ప్రాపర్టీ, ఫోర్ వీలర్, ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్, ఆదాయ పన్ను చెల్లింపు పరిమితుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ చివరి మైలు లబ్ధిదారునికి పథకం ద్వారా లబ్ధి జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

రైతులకు సులభంగా విత్తనాలు అందించటమే లక్ష్యం