
ఎందుకు? ఏమిటి? అడగొద్దు!
సాక్షి, మచిలీపట్నం: అధికారంలోకి రెండు నెలలైనా అక్క చెల్లెమ్మలకు ఒక్క పైసా లబ్ధి చేకూర్చని కూటమి ప్రభుత్వం.. వారి నుంచే రూ.కోట్లు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమరావతి నిర్మాణానికి విరాళం పేరుతో అనధికారికంగా కలెక్షన్లకు తెర లేప నున్నట్లు సమాచారం. ముఖ్యంగా డ్వాక్రా సభ్యు ల నుంచి సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో కూటమి నేత లు సూచించడంతో మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్ ఇప్పుడు జిల్లాలోని సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ అవుతోంది. అమరావతి నిర్మాణం పేరుతో డ్వాక్రా సభ్యుల నుంచి రూ.100 చొప్పున వసూ లు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎందుకు? ఏమిటి? అని అడక్కుండా ప్రతి ఒక్కరూ రూ.100 ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తు న్నట్లు ఆ ఆడియో క్లిప్పింగ్ ఉంది. అయితే సాధారణంగా నగదు స్వచ్ఛందంగా ఇస్తే దాన్ని విరాళం అంటారు. కానీ టీడీపీ బలవంతంగా వసూళ్లకు తెరలేపి, దాన్ని ‘విరాళం’ అనే పేరు పెట్టారు.
ఆడియో మెసేజ్లో ఇలా ఉంది..
‘అమ్మా అందరికీ నమస్కారం. అమరావతి రాజధాని కోసం ఒక్కొక్క సభ్యురాలి నుంచి రూ.100 కలెక్ట్ చేయాలి. చాలా వరకు గ్రూప్ లీడర్లకు ఫోన్ చేశాను. ప్రతి గ్రూప్ లీడర్ ఫాలో అప్ చేయాలి. ప్రతి సంఘంలో ఎంత మంది సభ్యులున్నారో అంత మంది నుంచి కలెక్ట్ చేయాలి. రేపు సాయంత్రంలోగా అందించాలి. అధ్యక్షురాళ్లు వసూలు చేసింది ఎస్ఎల్ఎఫ్లో వేస్తాం. ఎన్ని సంఘాల వాళ్లు ఇచ్చారన్నది సీఓకి మెసేజ్ పెట్టాలి. ఎస్ఎల్ఎఫ్ అకౌంట్ నుంచి డీఎల్ఎఫ్ అకౌంట్లో వేస్తాం. ఆ తర్వాత ఏం చేయాలో వాళ్లు చూసుకుంటారు. ఎందుకు? ఏమిటి? అని అడగొద్దు’ అంటూ ఉన్న రికార్డెడ్ ఆడియో క్లిప్పింగ్ జిల్లాలోని డ్వాక్రా సంఘాల వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జిల్లాలో రూ. 3.82కోట్లు వసూలు చేయాలని లక్ష్యం
జిల్లాలోని డ్వాక్రా మహిళల నుంచి రూ.3.82కోట్ల పైగా వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కూటమి పెద్దల ఒత్తిడి మేరకు డ్వాక్రా సంఘాలకు నాయకత్వం వహిస్తున్న వారి ద్వారా వసూలు చేయాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం జిల్లాలో 38,244 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. పట్టణాలు (మచిలీపట్నం నగర పాలక సంస్థ, మునిసిపాలిటీలు) పరిధిలో 8,500 సంఘాలుండగా వీరిలో 85వేల మంది సభ్యులు ఉన్నారు. రూరల్ పరిధిలో 29,744 సంఘాలు ఉండగా 2,97,440 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం 38,244 సంఘాలుండగా వాటిలో 3,82,440 మంది సభ్యులుగా ఉన్నారు. ఒక్కొక్క డ్వాక్రా మహిళ దగ్గర నుంచి రూ.100 చొప్పున వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా రూ.3.82కోట్ల మేర వసూలు చేసేందుకు తెర లేపినట్లు చర్చ జరుగుతోంది. ఎందుకు ఇవ్వాలని ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదన్న షరతు కూడా పెట్టడంతో డ్వాక్రా మహిళలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు.
అక్కచెల్లెమ్మలపై కూటమి ప్రభుత్వ హుకుం
లీడర్ల ద్వారా సభ్యుల నుంచి వసూళ్లు
ఒక్కొక్కరూ రూ.100 చెల్లించాలని వాయిస్ మెసేజ్లు
జిల్లా నుంచి రూ. 3.82కోట్లు వసూలుకు యత్నాలు