టిప్పర్‌ ఢీకొని వ్యక్తి దుర్మరణం

మరో ఎనిమిది మందికి గాయాలు

గన్నవరం:ట్రాక్టర్‌ను టిప్పర్‌ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బీబీగూడెం గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఎనిమిదికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన కాండ్రు ఆదాము (52) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వరికుప్పల నూర్పిడి పనుల నిమిత్తం అదే గ్రామానికి చెందిన ఎనిమిది మంది కూలీలతో కలిసి ఆదాము ట్రాక్టర్‌పై తెల్లవారుజామున గన్నవరం వైపు బయలుదేరాడు. గ్రామ సమీపంలోని ఎన్‌హెచ్‌ బైపాస్‌ వద్ద గన్నవరం నుంచి గొల్లనపల్లి వైపు వేగంగా వెళ్తున్న టిప్పరు ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ ట్రాక్‌కు టిప్పర్‌ మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన ఆదాము అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్‌పై ఉన్న మరో ఎనిమిది మంది కూలీలు గాయపడడంతో 108 అంబునెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. టిప్పరు అతివేగం కారణంగా తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top