పక్కాగా నో బ్యాగ్‌ డే | - | Sakshi
Sakshi News home page

పక్కాగా నో బ్యాగ్‌ డే

Jun 23 2025 6:16 AM | Updated on Jun 23 2025 6:16 AM

పక్కాగా నో బ్యాగ్‌ డే

పక్కాగా నో బ్యాగ్‌ డే

కెరమెరి: పుస్తకాల బరువుతో ఉక్కిరిబిక్కిరవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇక ప్రతినెలా మూడో శనివారం పుస్తకాలు లేకుండానే విద్యార్థులు బడికి వెళ్లనున్నారు. బడి అంటేనే పుస్తకాలు, కాపీలు, పెన్నులు, రాతలు, చదువులు ఉండేవి. ఇక నెలలో ఒక్కరోజు ప్రభుత్వం వాటన్నింటికి సెలవు ప్రకటించింది. తాజాగా మూడో శనివారం ‘నో బ్యాగ్‌ డే’ పాటించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

పుస్తకాల మోతతో బేజారు..

పాఠశాల విద్యార్థులు పుస్తకాల మోతతో బేజారెత్తిపోతున్నారు. వయసుకు మించి బరువును భుజాలకు తగిలించుకుని నానాఅవస్థలు పడుతూ బడులకు వెళ్తున్నారు. బరువుల మోతతో అలసిపోయి సాయంత్రం ఇంటికి వస్తున్నారు. ఇల్లు చేరాక మళ్లీ హోంవర్క్‌ అంటూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఆటపాటలతో సాగాల్సిన బాల్యం బండెడు మోతతోనే సరిపోతుంది. విద్యా విధానంలో ఎన్ని మార్పులు వచ్చినా ఒత్తిడితో కూడిన చదువులు మాత్రం పిల్లల మానసికస్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పాఠ్య, నోటు పుస్తకాలతో కూడిన సంచుల బరువు పిల్లల శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం జాతీయ విద్యాప్రణాళిక విధానంలో పుస్తకాల సంచి విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నెలలో ఒకరోజు విద్యార్థులు పుస్తకాలు లేకుండా బడికి వెళ్లి ఆటపాటలతో గడపాలని చూచించింది. దీన్ని ఇతర రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తుండగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఈ ఏడాది నుంచి అమలు చేయనుంది. ఈమేరకు నెలలో మూడో శనివారం ‘నోబ్యాగ్‌ డే’ గా నిర్ణయించింది. గత ప్రభుత్వం హయాంలోనే ఈ నిబంధన ఉన్నప్పటికీ ఎక్కడా ఆదేశాలు పాటించలేదు. ఈ సంవత్సరం దీన్ని పక్కాగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న పాఠశాలలు 1268 ఉన్నాయి. ఇందులో సుమారు 85వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

2020లోనే..

2020 సంవత్సరంలోనే కేంద్రం ‘నో బ్యాగ్‌ డే’ పాలసీ తీసుకొచ్చింది. కానీ అమలు దిశగా అడుగులు పడలేదు. 2017లోనే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నెలలో ఒకరోజు పుస్తకాల సంచి లేకుండానే విద్యార్థులు బడికి రావాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌తో పాటు హరియాణా, కర్ణాటక, మణిపూర్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే నో బ్యాగ్‌ డే మూడో శనివారం అమలు చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలను సైతం ఆదేశించింది. ఈమేరకు అప్పట్లోనే రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు లేఖలు రాసింది. దీంతో 2022 –23 నుంచి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రతినెలా మూడో శనివారం ‘నో బ్యాగ్‌ డే’ పాటించాలని విద్యాశాఖ విడుదల చేసిన క్యాలెండర్లో స్పష్టం చేసింది.

పుస్తకాల బరువుతో సుర్దాపూర్‌ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు

ఉండాల్సిన పుస్తకాల బరువు..

ప్రతినెలా మూడో శనివారం అమలు

పుస్తకాల మోత నుంచి

చిన్నారులకు విముక్తి

ఆటపాటలతో సృజనాత్మకతకు కృషి

ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ

అమలయ్యేనా..?

అనేక పాఠశాలల్లో ప్రతీరోజు సాయంత్రం ఒక పీరియడ్‌ ఆటపాటలకు కేటాయిస్తున్నా రు. కానీ నెలలో ఒకరోజు ‘నో బ్యాగ్‌ డే’ నిర్వహించనుండడంతో ప్రతీనెల మూడో శనివారం పుస్తకాల బరువు నుంచి విద్యార్థులకు విముక్తి కల్పించనున్నారు. మూడో శని వారం విద్యార్థులు బ్యాగులు లేకుండా బడి కి రావాల్సి ఉంటుంది. ఆ రోజు పిల్లలతో చిత్ర లేఖనం, నృత్యం, బాలసభ, మిమిక్రి, హాస్యకవితా సమ్మేళనం, నాటికలు, నాట్య ప్రదర్శన వంటివి చేయించనున్నారు. ఈ విధానం అమలుపై సందేహాలు లేకపోయినా ప్రైవేట్‌ పాఠశాలల్లో ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థులను ఆటలకు దూరంగా ఉంచుతున్నారనే భావన ఉంది. సెలవు రోజుల్లో బడి కొనసాగించడం.. ప్రత్యేక తరగతుల పేరిట గంటల తరబడి చదువులకు విద్యార్థులను అంకితం చేస్తుండడంతో ‘నో బ్యాగ్‌ డే’ ఆయా పాఠశాలల్లో ఏమేరకు అమలు చేస్తారో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement