
సమగ్రాభివృద్ధి దిశగా భారత్
● ఎంపీ గోడం నగేశ్
ఆసిఫాబాద్అర్బన్: మోదీ 11 ఏళ్ల పాలనలో భారత దేశం సమగ్రాభివృద్ధి దిశగా సాగుతోందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ హయాంలో ఆర్టికల్ 370 రద్దు, రామమందిరం నిర్మాణం, కరోనా సమయంలో టీకాల పంపిణీ, రైల్వేల ఆధునికీకరణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 143 టవర్లు ప్రతిపాదించగా, కుమురంభీం ఆసిఫాబాద్లో 80 టవర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పీఎం సడక్ కింద రూ.550 కోట్లు ఖర్చు చేయగా, సెంట్రల్ రోడ్ నిధుల ద్వారా రూ.350 కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు. జోడేఘాట్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లలో కూడా 50శాతం కేంద్రం నిధులు ఉన్నాయని తెలిపారు. అనంతరం టైగర్ కన్జర్వేషన్కు సంబంధించి జీవో 49పై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల మేరకు కేంద్రం అంగీకరించిందన్నారు. నిరసనలు రావడంతో కేంద్ర ప్రభుత్వాన్ని ముద్దాయిగా చేస్తామంటే ఒప్పుకోమన్నారు. జీవో 49పై నివేదిక పంపిస్తే రద్దుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, వన్ నేషన్– వన్ ఎలక్షన్ జిల్లా చైర్మన్ అరిగెల నాగేశ్వర్రావు, నాయకులు కోట్నాక విజయ్, సొల్లు లక్ష్మి, గుల్బం చక్రపాణి, సెర్ల మురళీధర్, కోవ విజయ్కుమార్, ప్రసాద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.