ఖమ్మం అర్బన్: జిల్లాలో సాగునీటికి ప్రధాన ఆధారమైన నాగార్జున సాగర్ ఎడమకాల్వలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ వానాకాలంలో సాగు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం నెలకొంది. జిల్లాలో అధికారికంగా 2.54 లక్షల ఎకరాలు, లిఫ్ట్ల పరి ధిలో ఆయకట్టు కలిపితే మూడు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించాల్సిన ప్రధాన కాల్వలపై పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు నీరు చేరకపోవచ్చనే ఆందోళన రైతుల్లో పెరుగుతోంది. గతేడాదే ఇబ్బంది పడ్డామని, ఈ సంవత్సరమైనా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి పంటలకు సక్రమంగా నీరందించాలని రైతులు, వివిధ సంఘాల నాయకులు ఇటీవల కలెక్టరేట్ ఎదుట అందోళన చేశారు.
తాత్కాలిక మరమ్మతులే..
గత వానాకాలంలో పాలేరు నుంచి సాగర్ ప్రధాన కాల్వలో పలు చోట్ల తీవ్రంగా గండ్లు పడినా తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెట్టారు. ప్రధాన కాల్వ లతోపాటు బ్రాంచ్, మేజర్, మైనర్ కాల్వల్లో పూడిక పేరుకుపోయి, తూములు, షట్టర్లు ధ్వంసమై, చెట్లు పెరిగి నీరు సక్రమంగా వెళ్లే పరిస్థితి లేదు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా జలవనరుల శాఖ అధికారులు సరైన దృష్టి పెట్టకపోవడం, అంచనాలకు తగ్గట్టుగా నిధులు మంజూరు కాకపోవడంతో రైతులు అసంతృప్తికి లోనవుతున్నారు.
అన్ని చోట్లా అంతే..
కల్లూరు సర్కిల్ పరిధిలోని కల్లూరు, మధిర, సత్తుపల్లి డివిజన్లలో సాగర్ ఎడమ కాల్వ ఆధారంగా పంటలు వేస్తుంటారు. అయితే కాల్వల్లో పూడిక, చెత్త, పిచ్చిమొక్కలు పెరగడంతో చివరి భూములకు నీరందడం లేదు. ఏన్కూరు, కొణిజర్ల, మధిర, తల్లాడ మండలాల్లో కాల్వలు మరీ దయనీయ స్థితిలో ఉన్నాయి. ఏన్కూరు మండలంలోని మేడేపల్లి, రఘునాథపాలెం మండలం మూలగూడెం మధ్య 22 కిలోమీటర్ల మేర కంపచెట్లు ఉన్నాయి. వంతెనలు కూడా శిథిలావస్థకు చేరాయి. రెగ్యులేటర్ షట్టర్లు ధ్వంసమై నీరు బయటకు వెళ్లిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ బ్యాంకు నిధులతో కాల్వ లకు ఆధునికీకరణ పనులు చేయగా, ఆ తర్వాత నామమాత్రంగానే పనులు జరగడం, కొత్తగా నిధులు మంజూరు కాకపోవడంతో మరమ్మతుల కోసం నిరీక్షిస్తున్నాయి. మధిర మండలంలో మేజర్ కాల్వల్లో చెట్ల్లు పెరిగి, పూడిక పేరుకుపోయి నీరు పారే పరిస్థితి లేదు. తూములు, షట్టర్లు ధ్వంసమై సాగునీరు వృథాగా వాగుల్లోకి వెళ్తుండగా పంటలు ఎండిపోతున్నాయి. పాలేరు – సాగర్ ప్రధాన కాల్వ లో గతేడాది ఏర్పడిన గండ్లకు ఇప్పటికీ పూర్తిగా మరమ్మతులు చేయలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించకుంటే వానాకాలం పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు.
రూ.కోటితో ప్రధాన కాల్వ మరమ్మతులు..
సాగర్ ప్రధాన కాల్వ జిల్లా సరిహద్దు నుంచి ఏపీ సరిహద్దు వరకు ఖమ్మం, కల్లూరు సర్కిళ్ల పరిధిలో జంగిల్ క్లియరెన్స్ (కంపచెట్లు తొలిగింపు)యూటీ, హెడ్ వర్క్స్ మరమ్మతులకు రూ.కోటి మంజూరయ్యాయి. ఖమ్మం సర్కిల్లో రూ.40 లక్షల విలువైన పనులు సాగుతుండగా, కల్లూరు పరిధిలో రూ. 60 లక్షల విలువైన పనులకు టెండర్ల దశలోనే ఉన్నట్లు తెలిసింది. జంగిల్ తొలగించాక బలహీనంగా ఉన్న కాల్వకట్టలు, పూడికలను గుర్తించి మరమ్మతులు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
మరమ్మతులకు నోచుకోని సాగర్ కాల్వలు
నీటి సరఫరాకు అడుగడుగునా
అడ్డంకులే
మెయిన్ కెనాల్లో జంగిల్ క్లియరెన్స్కు రూ.కోటి నిధులతో అంచనా
ఖమ్మం సర్కిల్లో మొదలు..
కల్లూరులో ఖరారు కాని టెండర్లు
పనులు సాగుతున్నాయి..
వరద కారణంగా దెబ్బతిన్న యూటీ మరమ్మతు పనులు వేగంగానే సాగుతున్నాయి. సాగర్ ప్రధాన కాల్వకట్టలపై చెట్ల తొలిగింపు పనులు చేస్తున్నాం. నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– ఎం.వెంకటేశ్వర్లు ఖమ్మం సర్కిల్ ఎస్ఈ
ఆయకట్టుకు ఇబ్బంది రానివ్వొద్దు
రైతులు సాగు మొదలు పెట్టిన తర్వాత కాకుండా ముందస్తుగానే సాగర్ ఆయకట్టు వరకు నీరందేలా అవసరమైన మరమ్మతులు చేయాలి. కాల్వల్లో చెట్లు పెరగడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాదైనా ఆ సమస్య లేకుండా చూడాలి.
–బొంతు రాంబాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి
యూటీ మరమ్మతులు..
గత ఏడాది వరదతో తెగిన యూటీ వద్ద రూ.14 కోట్ల అంచనాలతో పనులు కొనసాగుతున్నాయి. నీటి విడుదల నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈలోపు వానలు, వరదలు అడ్డంకిగా మారకుంటే పనులు పూర్తవుతాయి. లేదంటే మళ్లీ కష్టాలు తప్పవు. అధికారులు మాత్రం యూటీ మరమ్మతులు జూలై మొదటి వారం కల్లా పూర్తి చేస్తామని అంటున్నారు.
సాఫీగా సాగేదెలా?
సాఫీగా సాగేదెలా?
సాఫీగా సాగేదెలా?