
కొన్నే భళా.. మరిన్ని డీలా
● ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు అంతంతే ● జిల్లా కేంద్రంలో మాత్రం ఆశాజనకంగా చేరికలు ● మిగతా చోట్ల ఆశించిన స్థాయిలో దక్కని ఫలితం
ప్రవేశాలు పెంచేలా చర్యలు
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రచారం చేస్తూ ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా కొన్ని అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. –రవిబాబు, డీఐఈఓ
ప్రచారం చేస్తున్నాం..
విద్యార్థుల ప్రవేశాలు పెంచేలా ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. దీని ద్వారానే ప్రవేశాల సంఖ్య పెరిగింది. ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో అందుతున్న విద్య, పాఠ్యపుస్తకాలు, సౌకర్యాలపై అవగాహన కల్పిస్తూ ప్రవేశాలు పెంచుతున్నాం.
–ఆర్.గోవిందరావు, ప్రిన్సిపాల్,
శాంతినగర్ జూనియర్ కళాశాల, ఖమ్మం
ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో సౌకర్యాలు కల్పించడంతోపాటు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తున్నా ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగడం లేదు. అధికారులు ఆది నుంచీ ప్రయత్నాలు చేసినా సత్ఫలితాలు రావడం లేదు. పలు కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది గతేడాది చివరి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో విస్తృత ప్రచారం చేసి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరాలని పదో తరగతి విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేశారు. అయితే ఖమ్మం నగరంలోని మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్లు అధికంగా ఉండగా.. మిగతా చోట్ల మాత్రం అరకొరగానే నమోదయ్యాయి.
1,632 మంది చేరిక..
జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. ఇప్పటి వరకు 1,632 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. ఇందులో జనరల్ విభాగంలో 1,127, ఒకేషనల్లో 505 మంది విద్యార్థులు చేరారు. ఖమ్మంలోని ఏఎస్ఆర్ శాంతినగర్ జూనియర్ కళాశాలలో 310 మంది చేరగా.. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 186 మంది, నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 166 మంది, కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 161 మంది, నయాబజార్ జూనియర్ కళాశాలలో 131 మంది ప్రవేశాలు పొందారు. కాగా, గతేడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో శాంతినగర్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించి ప్రతిభ చాటారు. దీంతో ఈ కళాశాలకు ఈసారి ఆదరణ లభించినట్లు తెలుస్తోంది.
31 వరకే గడువు..
గత నెల నుంచి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు విస్తృత ప్రచారం నిర్వహించిన అధ్యాపకులు.. ఈనెల ఒకటో తేదీ నుంచి కళాశాలలను పునఃప్రారంభించారు. కాగా, ప్రవేశాల గడువు ఈ నెల 31 వరకే ఉంది. జిల్లాలోని 21 కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులతోపాటు ఒకేషనల్కు సంబంధించి మొత్తంగా 8,882 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉండగా.. ఇప్పటి వరకు 1,632 మంది మాత్రమే చేరడం గమనార్హం. గతేడాది సుమారు 3,500 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందగా.. ఈసారి అంతమంది విద్యార్థులు చేరే అవకాశం లేదనే చర్చ సాగుతోంది. సమయం గడుస్తున్నా అడ్మిషన్లు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు.
అతి తక్కువ ఇక్కడే..
జిల్లాలోని కొన్ని జూనియర్ కళాశాలల్లో చాలా తక్కువ అడ్మిషన్లు నమోదయ్యాయి. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు జూనియర్ కళాశాలలో ఇప్పటి వరకు ఇద్దరే చేరగా.. కామేపల్లి జూనియర్ కళాశాలలో ఐదుగురు, కందుకూరు బండి సీతారత్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10 మంది, కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 15 మంది, ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 29 మంది, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు జూనియర్ కళాశాలలో 33 మంది, సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 48 మంది మాత్రమే చేరారు. మిగతా కళాశాలల్లో 50కి పైగా ప్రవేశాలు జరిగినా కేటాయించిన సీట్లతో పోలిస్తే పావు వంతు కూడా చేరలేదు. అయితే అధికారులు మాత్రం కొన్ని అడ్మిషన్లు ఆన్లైన్ చేయాల్సి ఉందని చెబుతుండటం గమనార్హం.

కొన్నే భళా.. మరిన్ని డీలా

కొన్నే భళా.. మరిన్ని డీలా