
కార్మికవర్గ ఐక్యతే ఎస్డబ్ల్యూఎఫ్ లక్ష్యం
● ఆర్టీసీ పరిరక్షణ, హక్కుల సాధనకు ఉద్యమించండి ● సీఐటీయూ నేత పాలడుగు భాస్కర్
ఖమ్మంమయూరిసెంటర్ : ఆర్టీసీ కార్మికుల ఐక్యతకు వారధిగా.. పోరాటాల సారథిగా, కార్మికవర్గ ఐక్యతే లక్ష్యంగా ఎస్డబ్ల్యూఎఫ్ పని చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ఖమ్మం ఐఎంఏ హాల్లో రెండు రోజుల పాటు జరిగిన ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు నష్టం కలిగించే ప్రభుత్వ, యాజమాన్య విధానాలకు వ్యతిరేకంగా పోరాడే సంఘం ఎస్డబ్ల్యూఎఫ్ ఒక్కటేనని చెప్పారు. సంస్థలో 55 రోజుల పాటు జరిగిన సమ్మెకు సీఐటీయూ అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఆర్టీసీని పరిరక్షించేది ఐక్య పోరాటమేనని పిలుపునిచ్చారు. కార్మికులు అనుభవిస్తున్న కష్టాలు, ఆర్టీసీ ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఔట్సోర్సింగ్ విధానాలు, ఎలక్ట్రికల్ బస్సులు, పెరిగిన పనిభారాలు అన్నీ కూడా ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల ఫలితమేనని విమర్శించారు. జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మహాసభలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ఉమెన్ కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్వీ రమ, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ కార్యదర్శి అర్ముగనాయర్, ఏపీ ఎస్డబ్ల్యూఎఫ్ కోశాధికారి దివాకర్, ఆహ్వాన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కళ్యాణం వెంకటేశ్వరరావు, పిట్టల సుధాకర్, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం లింగమూర్తి, ఆర్టీసీ శ్రామిక మహిళా కమిటీ నాయకులు పద్మావతి, వివిధ విభా గాల నాయకులు మాధవరావు, రోశయ్య, పగిళ్లపల్లి నరసింహారావు, గడ్డం వెంకటయ్య, వి.రమేష్, బుగ్గవీటి లింగమూర్తి, భాగ్యలక్ష్మి, మల్లికాంబ, పద్మ, విజయలక్ష్మి, సరిత, సీతారామారావు పాల్గొన్నారు.