శిశువుకు ఆరోగ్య రక్ష | - | Sakshi
Sakshi News home page

శిశువుకు ఆరోగ్య రక్ష

Jun 23 2025 5:38 AM | Updated on Jun 23 2025 5:38 AM

శిశువ

శిశువుకు ఆరోగ్య రక్ష

● నేటి నుంచి మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమాలు ● మిస్సింగ్‌, డ్రాపౌట్‌ చిన్నారులకు వ్యాక్సినేషన్‌ ● 12 రకాల వ్యాధులకు 11 రకాల టీకాలు

ఏ టీకా ఎప్పుడు..

●శిశువు జన్మించగానే టీబీ రాకుండా బీసీజీ, పోలీయో రాకుండా ఓపీవీ, కాలేయ సమస్యలు రాకుండా హెపటైటీస్‌ బీ టీకా వేస్తారు.

●ఆరు వారాలకు పెంటావాలెంట్‌, రోటావైరస్‌, ఓరల్‌ పోలియో, పీసీవీ, ఐపీవీ టీకాలు ఇస్తారు.

●పది వారాలకు పెంటావాలెంట్‌, ఓరల్‌ పోలియో, రోటావైరస్‌ టీకా ఇస్తారు.

●14 వారాలకు పెంటా వాలెంట్‌, రోటావైరస్‌, ఓరల్‌ పోలియో, పీసీవీ టీకా వేస్తారు.

●9 నుంచి 12 నెలల మధ్య మిజిల్స్‌, రుబెల్లా, జపనీస్‌ ఎన్‌సప్‌లైటీస్‌, పీసీవీ, ఐపీవీ టీకా ఇస్తారు.

●16 నుంచి 24 నెలల మధ్య ఎంఆర్‌, జేఈ, ఓరల్‌ పోలియో, డీపీటీ టీకా ఇస్తారు.

●5 నుంచి ఆరేళ్ల మధ్య డీపీటీ బూస్టర్‌–2

●పదేళ్లకు టెటనస్‌ అండ్‌ డిఫ్తీరియా(టీడీ) వ్యాక్సిన్‌ ఇస్తారు.

●16 ఏళ్లకు టెటనస్‌ అండ్‌ డిఫ్తీరియా(టీడీ) వ్యాక్సిన్‌ వేస్తారు.

●గర్బిణీలకు టీడీ1, టీడీ2 లేదా టీడీ బూస్టర్‌ వ్యాక్సిన్‌ ఇస్తారు.

ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమం సోమవారం నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. 12 రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు 11 రకాల టీకాలు వేయనున్నారు. ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఈ నెల 30 వరకు కొనసాగనుంది. మిస్సింగ్‌, డ్రాపౌట్‌ పిల్లలను గుర్తించి టీకాలు ఇవ్వనున్నారు. గతంలో మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమం ద్వారా ఏడు రకాల వ్యాధులకు టీకాలు వేయగా ప్రస్తుతం 12 రకాలకు పెంచారు. పోలియో, టీబీ, డిఫ్తీరియా, పెర్టుసిస్‌(వూపింగ్‌ దగ్గు), టెటనస్‌, పొంగు, రుబెల్లా, హెపటైటిస్‌ బీ, మెనింజైటిస్‌, హిమోఫిలస్‌ ఇన్‌ఫ్లూఝెంజా బీ(హెచ్‌ఐబీ), న్యూమోనియా, రోటా వైరస్‌, గ్యాస్ట్రోంటెరిటిస్‌ వ్యాధులు సంక్రమించకుండా టీకాలు అందిస్తారు.

టీకాలు వేస్తూ.. అవగాహన కల్పిస్తూ..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమం పిల్లల ఆరోగ్యానికి రక్షగా నిలుస్తోంది. సాధారణంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నిత్యం ఈ టీకాలు వేస్తుంటారు. పీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్లలో ప్రతీ బుధవారం టీకాలు వేస్తారు. మిగతా చోట్ల ప్రతీ శనివారం వేస్తారు. అయితే కొందరు తల్లిదండ్రులు వీటిపై అవగాహన లేక, మరిచిపోయి పిల్లలకు టీకాలు వేయించకుండా ఉంటారు. కాగా, ప్రతి సంవత్సరం మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమంతో అలాంటి వారిని గుర్తిస్తూ టీకాలు వేయడంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు.

గర్భిణులకూ టీకాలు..

జిల్లాలో మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమం కోసం డ్రాపౌట్స్‌, మిస్సింగ్‌, లెఫ్ట్‌ ఔట్‌ శిశువులపై జిల్లా వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 904 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా గర్భిణులకు కూడా టీకాలు వేయనున్నారు. ఇప్పటివరకు 214 మంది గర్భిణులను గుర్తించారు. ప్రత్యేకంగా సంచారజాతులు, మురికి వాడలు, నిర్మాణ ప్రాంతాలు, ఇటుక బట్టీలు, రవాణా సౌకర్యంలేని తదితర ఏరియాలపై దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

సద్వినియోగం చేసుకోవాలి

మిషన్‌ ఇంద్రధనుష్‌ ద్వారా అందించే టీకాలు చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి. ప్రాణాంతకమైన 12 రకాల వ్యాధులు రాకుండా కాపాడుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు నిర్దిష్ట సమయాల్లో సూచించిన టీకాలు వేయిస్తే ఆరోగ్యంగా ఉంటారు. సోమవారం నుంచి నిర్వహించే ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి.

– రమణ, జిల్లా వ్యాక్సిన్‌ మేనేజర్‌

శిశువుకు ఆరోగ్య రక్ష1
1/1

శిశువుకు ఆరోగ్య రక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement