
ఆదర్శవంతంగా ఏదులాపురం
ఖమ్మంరూరల్ : నూతనంగా ఏర్పాటైన ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు రహదారుల నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తూ, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పథకాలను అందిస్తున్నామని, తద్వారా పేదలు ఆనందంగా ఉన్నారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రేషన్కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడం చారిత్రక నిర్ణయమని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబ్్, ఈఈ యుగంధర్, ఆర్డీఓ నర్సింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ